మెదక్ : రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress ) పట్టించుకోవడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ యం . పద్మ దేవేందర్ రెడ్డి ( Padma Devender Reddy ) విమర్శించారు. శంకరంపేట్ మండలం అంబాజీపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మండల నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన రైతు రాజయ్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించి ఉంటే రాజయ్య ప్రాణాలు నిలిచేవని అన్నారు.ధాన్యం డబ్బులు వస్తే రైతు అప్పులు తీర్చుకునేవాడని, రాజయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు.
వడ్లు కొనుగోలు చేసి సమయానికి మిల్లులకు తరలించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎంత ధాన్యం కొనుగోలు అయింది, ఇంకా ఎంత నిల్వలో ఉంది, ఎన్ని లారీలు అవసరమో తెలుసుకోవడంలో కూడా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె వెంట బీఆర్ఎస్ శంకరంపేట్ మండల అధ్యక్షులు పట్లోరి రాజు, గవ్వలపల్లి సర్పంచ్ సిద్ధిరాములు, మాజీ వైస్ ఎంపీపీ సత్య గౌడ్, మాజీ సర్పంచులు పోచయ్య, దయానంద్, నాయకులు ప్రభాకర్, పడాల శ్రీనివాస్, మహేష్, కొమురయ్య, మల్లుపల్లి సర్పంచ్ నరేష్,రైతులు తదితరులు ఉన్నారు.