Hemoglobin | రక్తంలో హిమోగ్లోబిన్ చాలా ముఖ్యమైనది. రక్తం ఎరుపు రంగులో ఉండేందుకు కారణమైన హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్.. శరీరం చుట్టూ ఆక్సిజన్ను తీసుకెళ్లడంతో సాయపడుతుంది. ఆక్సిజన్ను రవాణా చేయడంతో పాటు హిమోగ్లోబిన్ కార్బన్ డై ఆక్సైడ్ను ఎర్రరక్త కణాల నుంచి ఊపిరితిత్తుల్లోకి తీసుకువెళ్తుంది. శరీరంలో తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవడం, కొత్తగా తయారయ్యే వాటికంటే ఎక్కువ ఎర్ర రక్తకణాలు నశించిపోవడం, ఏదైనా ఆరోగ్యసమస్య వల్ల ఎక్కువగా రక్తం పోవడం వంటి కారణాల వల్ల హిమోగ్లోబిన్ తక్కువగా తయారవుతుంది. ఇది ఒక్కోసారి ప్రాణాపాయానికి దారితీస్తుంది.
లక్షణాలు.. కారణాలివీ..
హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఉన్నప్పుడు రక్తహీనత సమస్య తలెత్తుతుంది, శరీరం విధులు నిర్వహించడం కష్టమవుతుంది. ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉండటం వల్ల అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిస్సత్తువ, హార్మోన్ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గటం, జుట్టు రాలటం, చర్మం పాలిపోవటం, గర్భిణుల్లో గర్భస్రావం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. థైరాయిడ్, కిడ్నీలు లేదా కాలేయ సమస్య ఉండటం వల్ల, విటమిన్ బీ 12, ఫోలిక్ ఆసిడ్ వంటి విటమిన్ల లోపం వల్ల కూడా హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడానికి ఐరన్ బాగా పనిచేస్తుంది.
పెంచుకోవడం ఇలా..
హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నది సాధారణ రక్త పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్షలో హిమోగ్లోబిన్ స్థాయిలను తెల్సుకోవచ్చు. ముఖ్యంగా మహిళలో ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దీనిని ఎదుర్కొనేందుకు ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు.. ఆకు కూరలు, టమాట, కోడిగుడ్లు, చికెన్, సీఫుడ్, ఖర్జూరం, బాదం, బీన్స్, తృణధాన్యాలు, పెరుగు, విత్తనాలు తీసుకోవాలి. అలాగే, సీ విటమిన్ కోసం నారింజ, నిమ్మ, బ్రోకలి, ద్రాక్ష, బొప్పాయి తింటూ ఉండాలి. ఫోలిక్ యాసిడ్ అధికంగా లభించే బచ్చలికూర, పల్లీలు, కిడ్నీ బీన్స్, అవకాడో, పాలకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఖర్జూరం, నువ్వులు, ఎండు ద్రాక్ష వంటి వాటిని నిత్యం తినేలా ప్లాన్ చేసుకోవాలి.
వీటిని దూరం పెట్టాలి..
పాలు, చీజ్ వంటి పాల ఉత్పత్తులను చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి.
టీ, కాఫీ, సోడా, ఆల్కహాల్లను దూరం పెట్టాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.