Health bits | మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఆకలి అవుతుంది. పళ్లు అలా తోమగానే ఇలా ఏదో ఒకటి లాగించేస్తాం. అయితే, ఏదో ఒకటి తిని ఆరోగ్య సమస్యలను తెచ్చుకోవానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి మన రోజంతా మన పనితీరును నిర్ణయిస్తాయి. కొన్ని జీర్ణక్రియ సమస్యలకు కలుగజేస్తుండగా.. మరికొన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మరీ ముఖ్యంగా చలికాలంలో ఖాళీ కడుపుతో ఏదంటే అది తినడం మంచిది కాదని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు.
మనకు ఆరోగ్యాన్నిచ్చే కొన్నిరకాల పండ్లు, కూరగాయలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్య సమస్యలను తీసుకొస్తాయి. వీటిని ఖాళీ కడుపుతో తినకుండా చూసుకోవాలి. అలా చేయని పక్షంలో జీవక్రియలు మందగించిపోవడం, జీర్ణసంబంధ సమస్యలు వస్తుంటాయి. ఏదో ఒక ఆహారం తీసుకున్న కొద్ది సేపటి వరకు తినకూడని ఆహారాల గురించి తెల్సుకుందాం.
సిట్రస్ జాతి పండ్లు..
నారింజ, ద్రాక్షపండ్ల వంటి సిట్రస్ జాతి పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్, ఫ్రక్టోజ్ జీవక్రియలను నెమ్మదించేలా చేస్తాయి. అలాగే, కడుపు సమస్యలు, గుండెల్లో మంటను కలిగిస్తాయి. సిట్రస్ పండ్లు చర్మానికి చాలా ఆరోగ్యకరమైనవి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినకుండా చూసుకోవాలి.
స్పైసీ ఫుడ్స్..
ఉదయం పూట స్పైసీ ఫుడ్స్, మిరపకాయలు తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అవి కడుపులో ఆమ్ల ప్రతిచర్యలు, తిమ్మిర్లను కలిగిస్తాయి. అలాగే, రోజంతా ఆరోగ్యాన్ని ఇబ్బందికరంగా తయారు చేస్తుంది.
స్వీట్స్..
ఉదయం నిద్ర లేవగానే వెంటనే చాక్లెట్లను తినకుండా చూసుకోవాలి. వీటిలో చక్కెర కంటెంట్ ఇన్సులిన్ స్థాయిలను వెంటనే పెరిగేలా చేస్తుంది. తర్వాతి రోజుల్లో ప్యాంక్రియాస్కు హాని కలిగిస్తుంది. స్వీట్స్ కాకుండా ఇతర చక్కెర ఆహారాలను కూడా దూరం పెట్టాలి.
ఎరేటెడ్ డ్రింక్స్
ఉదయాన్నే సోడా వంటి ఎరేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇది జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. అదనంగా కడుపుకు రక్త సరఫరాను తగ్గిస్తుంది. శ్లేష్మ పొరను దెబ్బతీస్తుంది. సోడాలను దూరం పెట్టి ఆరోగ్యానికి పనికొచ్చే గ్రీన్ టీ వంటి పానీయాలను తీసుకోవాలి.
ముడి కూరగాయలు..
క్యారెట్ వంటి పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినకుండా చూసుకోవాలి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే, కడుపులో సమస్యలు తీసుకొస్తుంది. అపానవాయువు, వికారం, గ్యాస్, కడుపు నొప్పికి కూడా దారితీస్తుంది. కాబట్టి, డైటింగ్ చేస్తున్నప్పటికీ ఉదయాన్నే పచ్చి కూరగాయలతో కూడిన సలాడ్లను తినకుండా చూసుకోవాలి.
శీతల పానీయాలు..
ఐస్డ్ టీ లేదా కాఫీ వంటి శీతల పానీయాలు తాగడం ద్వారా రోజును ప్రారంభించడం మానుకోవడం ఉత్తమం. ఎందుకంటే అవి రోజంతా మనల్ని మత్తుగా ఉంచుతాయి. శ్లేష్మ పొరను కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకునేందుకు గోరువెచ్చని పానీయం తీసుకోవడం శ్రేయస్కరం.
కాఫీ..
కాఫీప్రియులు ఉదయం పూట తమకెంతో ఇష్టమైన పానీయం తాగడం మానుకోవాలి. ఉదయం పూట కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ ఏర్పడి కడుపు ఉబ్బరం, వాంతులు అవుతాయి. కాఫీ తీసుకునే ముందు ఏదైనా తినడం చాలా మంచిది.
అరటిపండ్లు..
అరటిపండ్లు చాలా ఆరోగ్యకరమైనవి. అయినప్పటికీ వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అరటిపండ్లలో ఉండే మెగ్నీషియం శరీరంలో రక్త స్థాయిలను పెంచడంతోపాటు గుండె సమస్యలకు దారితీస్తుంది.
పులియబెట్టిన పాల ఉత్పత్తులు..
పెరుగు వంటి పులియబెట్టిన పాల ఉత్పత్తులను ఖాళీ కడుపుతో తినకుండా చూడాలి. ఇవి జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఎక్కువ ప్రయోజనాలు కలగాలంటే మాత్రం ఇతర ఆహారాలు తీసుకొన్న తర్వాతనే వీటిని తినాలి.
చివరగా..
ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వారు ఉదయాన్నే బొప్పాయి, పుచ్చకాయ, నట్స్, ధాన్యపు రొట్టె, తేనె వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. ఏదో తినాలి కాబట్టి తిన్నాం అని.. ఆ తర్వాత ఇబ్బందిపడటం కన్నా సమస్యలకు గురిచేసే ఆహారాలను దూరం పెట్టడం అన్నింత శ్రేయస్కరం.