– కాపాడిన స్థానికులు, వాహనదారులు
బూర్గంపహాడ్, జూలై 21 : భద్రాచలం గోదావరి వంతెనపై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం సారపాక బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన గొల్లమూడి శైలజ గోదావరి వంతెనపై నుండి నదిలో దూకేందుకు సిద్ధపడింది. ఇది గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే స్పందించి ఆమెను పట్టుకుని నదిలో దూకకుండా అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరవుతున్న శైలజను ఓదార్చి స్టేషన్కు తరలించారు.
పోలీసుల విచారణలో బాధితురాలు శైలజ తన ఆవేదనను వ్యక్తపరిచింది. తన సొంత ఇంటి స్థలాన్ని ఆమె మరిది రమేశ్ అక్రమంగా ఆక్రమించుకున్నారని, తన భర్తపై పలు రకాల కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారని, న్యాయం కోసం ఐదు నెలలుగా తిరుగుతున్నా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో మనస్థాపంతో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడినట్లు తెలిపి కన్నీంటి పర్యంతమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం శైలజకు కౌన్సిలింగ్ ఇచ్చి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.