ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు, వృద్ధులు, ప్రముఖులు
పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు
ఓటింగ్ సరళిని పరిశీలించిన నాయకులు
హన్మకొండ/ హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 30: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా దృష్ట్యా ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు పాటించారు. మాస్కులు, ఫేస్షీల్డ్లు ధరించారు. ఓటర్లు సైతం కరోనా నిబంధనలు పాటించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. వీల్చైర్, కర్రల సహాయంతో వృద్ధులు తరలివచ్చి తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకుని ఇతర ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల 49/14పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. 5వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి తాడిశెట్టి విద్యాసాగర్ హన్మకొండ కుమార్పల్లిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. డివిజన్ల లోని ఆయా పోలీంగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరుగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోటీల్లో ఉన్న అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు.
31, 49వ డివిజన్లలో..
న్యూశాయంపేట : 31, 49వ డివిజన్ల లో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేశారు. మండల కేంద్రంలో 90 ఏళ్ల వృద్ధురాలు వీల్చైర్పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రూరల్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్..
చెన్నారావుపేట: వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత హన్మకొండలోని నక్కలగుట్టలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే అదనపు కలెక్టర్(లోకల్ బాడీ) భూక్యా హరిసింగ్ హన్మకొండలోని జులైవాడ ఎస్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటువేశారు.
61, 62, 47, 48 డివిజన్లలో..
కాజీపేట : కాజీపేట పట్టణంలోని 61, 62, 47, 48 డివిజన్ల పరిధి పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ ఆదేశాలమేరకు సీఐ రావుల నరేందర్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. 6వ డివిజన్లో మొత్తం 9,082 మంది ఓటర్లుండగా 2,901మంది ఓట్లు వేశారు. 62వ డివిజన్లో 10, 656మంది ఓటర్లకు 5,063మంది, 48వ డివిజన్లో 9,082 మంది ఓటర్లకు 4,177 మంది, 47వ డివిజన్లో 10,215 మంది ఓటర్లుండగా 4,021 మంది ఓటు వేశారు.
మడికొండలో పరిశీలించిన ఎమ్మెల్యే అరూరి
మడికొండ: గ్రేటర్ వరంగల్ 45, 46, 63, 64వ డివిజన్లలో ఉదయం నుంచే ఓటర్లు బారులుదీరారు. 45వ డివిజన్లో మొత్తం 8,721మంది ఓటర్లకు 6,427మంది ఓట్లు వేశా రు. 46వ డివిజన్లో 10,230మంది ఓటర్లుండగా 6,959 మంది, 63వ డివిజన్లో 10,514 మంది ఓటర్లకు 5, 666 మంది, 64వ డివిజన్లో మొత్తం 9,721మంది ఓటర్లుండగా 7,269మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయా పో లింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.