ముంబై : గతంలో కరోనా హాట్స్పాట్గా మారిన దేశ ఆర్థిక రాజధాని ముంబై కీలక మైలురాయిని చేరుకుంది. నగర జనాభాలో వ్యాక్సినేషన్కు అర్హత ఉన్న వారిలో సగం మంది కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. నగరంలో 90 లక్షల మంది 18 ఏండ్లు పైబడిన జనాభా ఉండగా 45 లక్షల మంది ఇప్పటివరకూ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని తెలిపింది. 11.5 లక్షల మంది వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్నారని స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ సరఫరాల్లో అవాంతరాలు లేకుంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ముమ్మరంగా సాగేదని బీఎంసీ వర్గాలు వె్లడించాయి. నగరంలో రోజుకు లక్ష నుంచి లక్షన్నర మందికి వ్యాక్సిన్ ఇచ్చే సామర్ధ్యం కార్పొరేషన్కు ఉందని బీఎంసీ తెలిపింది. రోజుకు సగటున దాదాపు 70,000 మందికి వ్యాక్సిన్స్ అందిస్తున్నామని వెల్లడించింది. తాము ఇదే సంఖ్యలో వ్యాక్సినేషన్ చేపడితే రెండు రోజుల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటుతాయని తెలిపింది. వ్యాక్సిన్ సరఫరాల్లో ఇబ్బందులు లేకుంటే ఊహించిన దానికంటే ముందే వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకునేవారమని బీఎంసీ వర్గాలు స్పష్టం చేశాయి.