విధి ఎంత బలీయమైనదో కదా ! తన తాత అస్తికలు నిమజ్జనం చేసేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లిన ఓ మనుమడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు !! నీటిలో కొట్టుకుపోతున్న ఒక అమ్మాయిని కాపాడే క్రమంలో నీట మునిగి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకుంది.
హైదరాబాద్లోని గాంధీనగర్కు చెందిన కార్తీక్ (24) తన తాత అస్తికలు కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు బుధవారం కుటుంబసభ్యులతో కలిసి బీచుపల్లి పుష్కరఘాట్కు వచ్చాడు. నిమజ్జనం కార్యక్రమం అనంతరం కుటుంబీకులు అందరూ నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో స్వీటీ అనే అమ్మాయి ఘాట్ మెట్లను దాటుకుంటూ కొంచెం లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లింది. ఆ సమయంలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో స్వీటీ నదిలో కొట్టుకుపోయింది. ఇది చూసిన కార్తీక్ నదిలో కొట్టుకుపోతున్న అమ్మాయిని రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ ఈత రాకపోవడంతో అతను కూడా నీటిలో మునిగిపోయాడు. అక్కడే పుట్టీలో ఉన్న జాలర్లు ఇది గమనించి.. స్వీటీ అనే అమ్మాయిని కాపాడారు. కానీ నీటిలో మునగడంతో కార్తీక్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. చికిత్స కోసం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా కార్తీక్ మార్గమధ్యలోనే మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.