మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 25 : కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రపర్చి పునర్ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీటీగుట్ట పాఠశాలలో చేపట్టిన శానిటేషన్ పనులను కలెక్టర్ పరిశీలించారు. అలాగే పోలీస్ లైన్, మోడల్ బేసిక్ స్కూల్, పాతపాలమూరు తదితర పాఠశాలలను అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటోతేదీ నుంచి పాఠశాలలను పునర్ప్రారంభిస్తున్న దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా శానిటేషన్ పనులు చేపట్టాలని సూచించారు. పాఠశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాలను 30వ తేదీలోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. పాఠశాలల శానిటేషన్పై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో ఉషారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ఎంఈవో జయశ్రీ, పారిశుధ్య విభాగం అధికారి సయ్యద్ మొహియొద్దీన్ పాల్గొన్నారు.
విద్యార్థులకు మెరుగైన వసతులు
కోయిలకొండ, ఆగస్టు 25 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. బుధవారం మండలంలోని పార్పల్లి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే, నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్తోపాటు మూత్రశాలలు, మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా కేశ్వాపూర్ పాఠశాలను డీఈవో ఉషారాణి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ మొగులయ్య పాల్గొన్నారు.
ఉన్నత పాఠశాలల పరిశీలన
జడ్చర్లటౌన్, ఆగస్టు 25 : పట్టణంలోని బాదేపల్లి బా లుర, బాలికల ఉర్దూ మీడియం, జడ్చర్ల ఉన్నత పాఠశాలలను బుధవారం అదనపు కలెక్టర్ సీతారామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో శానిటేషన్ పనుల వివరాలను హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే, మూత్రశాలలు, మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంఈవో మంజులాదేవి పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, ఆగస్టు 25 : మండలంలోని గొల్లపల్లి, మాచారం ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన శానిటేషన్ పనులను బుధవారం జెడ్పీ సీఈవో జ్యోతి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలను పూర్తిస్థాయిలో శుభ్రంచేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రధానంగా తరగతి గదిలో విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప, మాచారం సర్పంచ్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, ఆగస్టు 25 : మండలంలోని పలు పాఠశాలలను బుధవారం ఎంపీడీవో ధనుంజయగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పాఠశాలలను శుభ్రం చేయాలని సూచించారు. పాఠశాలల పరిశుభ్రత బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులదేనని తెలిపారు. కాగా, పాఠశాలల పునర్ప్రారంభంపై బహుజన క్లాస్ టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుయాదవ్, మండల అధ్యక్షుడు మల్లేశ్ హర్షం వ్యక్తం చేశారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, ఆగస్టు 25 : మండలంలోని పెద్దవార్వల్ పాఠశాలను బుధవారం పంచాయతీరాజ్ ఏఈ రాబర్ట్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల పునర్ప్రారంభమవుతున్న దృష్ట్యా తరగతిగదుల మరమ్మతుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లలిత తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఆగస్టు 25 : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం పారిశుధ్య పనులు చేపట్టారు. సెప్టెంబర్ 1నుంచి కళాశాల పునర్ప్రారంభమవుతున్న సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను శుభ్రం చేయిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటయ్య తెలిపారు.