వడ్డేపల్లి, ఏప్రిల్ 28 : విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి సబ్స్టేషన్ దగ్ధమైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి.. వడ్డేపల్లిలోలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఆపరేటర్ డ్యూటీలో ఉన్న సమయంలో ఎల్వీ జంపర్ తెగిపడింది. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆర్పడానికి అతడికి సాధ్యం కాలేదు. వెంటనే ఏఈ శాంతారాంకు, సిబ్బందికి సమాచారం అందించాడు. మంటలు ఎగిసిపడటంతోపాటు నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. చుట్టుపక్కల నివాసాల వారు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానిక నాయకులు, యూత్, విద్యుత్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు. ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా.. రెండు ఫైరింజన్లు వచ్చి దాదాపు రెండు గంటల పాటు కృషి చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో రెండు 5 ఎంవీఐ పవర్ ప్లాంట్లు, ఎల్వీలు, 33 కేవీ బ్రేకర్లు మంటలకు ఆహుతయ్యాయి. సుమారు రూ.3 కోట్ల నష్టం వాటిళ్లిందని డీఈ మోహన్ తెలిపారు. సబ్స్టేషన్లో మంటలతో 11 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతానికి విద్యుత్ సరఫరా రామాపురం, రాజోళి సబ్స్టేషన్ల నుంచి అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రెండ్రోజుల్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి అమర్చడానికి కృషి చేస్తామని ఆయనన్నారు. ప్రజలను మంటల సమీపానికి రాకుండా ఎస్సై శ్రీహరి ఆధ్వర్యంలో ఏఎస్సై ముత్తరాజు సిబ్బంది కృషిచేశారు.