ఖాళీ సంచులు తక్కెడపైఉంచి బియ్యం తూకం
కిలో బియ్యం తక్కువ వస్తున్నాయంటున్న లబ్ధిదారులు
పట్టించుకోని అధికారులు
కోస్గి, జూన్ 12 : బియ్యం తూకం చేయడంలో రేషన్ డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వారం రోజులుగా ప్రభుత్వం ఉచితంగా ఒక్కొక్కరికి 15 కిలోల రేషన్ బియ్యం అందించాలని, కరోనావల్ల పనులు కోల్పోయిన ప్రజలు ఎవరూ ఇబ్బందులకు గురికావద్దన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో డీలర్లు నీరుగారుస్తున్నారు. మండలంలోని తొగాపూర్గ్రామంలో వారం రోజులుగా లబ్ధిదారుడికి బియ్యం తూకం చేసేటప్పుడు తక్కెడపై రెండుమూడు ఖాలీ గోనెసంచులు ఉంచి బియ్యం తూకంచేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు కిలో బియ్యం నష్టపోతున్నారు. స్థానిక ప్రజలు ఇదేమిటని నిలదీస్తే తమకు పైనుండి ఆదేశాలున్నాయని నిర్లక్ష్యంగా డీలర్ సమాధానమిస్తున్నారు. ఒక్కో రేషన్కార్డు వద్ద కిలో బియ్యం మిగిలిస్తే డీలర్కు ఎన్ని రేషన్ కార్డులు వస్తే అన్ని కిలోల బియ్యం డీలర్కు మిగులుతున్నాయి. నిరుపేదలను డీలర్లు మోసం చేయడం సరికాదని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు.