మహబూబ్నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు పార్కు అంటేనే హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్ర మే సాధ్యమేమో అనే పరిస్థితి ఉండేది. క్రమంగా జిల్లా కేంద్రాల కు పార్కులు వచ్చాయి. తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో దర్శనమిస్తున్నాయి. కానీ మండలాలు గ్రామాల్లో పార్కుల ఊసే ఉండేది కాదు. తెలంగాణ సర్కార్ వచ్చాక గ్రామగ్రామాన పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. పల్లెల్లోనూ ఆహ్లాదాన్ని పంచే పార్కులు వచ్చేశాయి. గ్రామీణులు సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో సేదతీరే అవకాశం ఏర్పడింది. అయితే ప్రతి మండలానికో బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి మెగా పార్కును తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. అం దులో భాగంగా ప్రతి మండలంలో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నది. రూ.43 లక్షల
వ్యయంతో సుమారు 30 వేలకు పైగా మొక్కలను నాటుతూ పల్లెలకు సుందరమైన పార్కులను అందుబాటులోకి తెస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఇప్పటికే పనులు ముమ్మరంగా జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల స్థల సేకరణలో అధికారులు బిజీగా ఉన్నారు.
మండలానికో బృహత్ ప్రకృతి వనం..
పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు పర్యావరణ రక్షణ, కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. భ విష్యత్ తరాలకు ఆహ్లాద, ఆరోగ్యకర వాతావరణాన్ని అందించేందుకు ముందుకు సాగుతున్నది. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనంతో పచ్చదనం పెంచుతున్న ప్రభుత్వం తాజాగా హరిత శోభ ను మరింత ఇనుమడింపజేసేందుకు మండలానికో బృహత్ ప్ర కృతి వనం ఏర్పాటుకు నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 73 మండలాలు ఉండగా.. ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సింహభాగం మండలాల్లో స్థల సేకరణ పూర్తయింది. మరికొన్ని మండలాల్లో పనులు సైతం ప్రారంభమయ్యా యి. కొన్ని చోట్ల స్థల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకే చోట పదెకరాలు అవసరం ఉండడం, కేటాయించిన దాంట్లో ఎంత మేరకు ప్రభుత్వ భూములు అనువుగా ఉన్నాయని సంబంధిత అధికారులు రెవెన్యూ శాఖ వారితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
ఒక్కో వనంలో 30 వేలకు పైగా మొక్కలు..
ఒక్కో బృహత్ ప్రకృతి వనంలో 30 వేలకు పైగా మొక్కలు నాటుతున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటి చిట్టడవిగా మార్చనున్నారు. కనీసం 20 రకాల మొక్కలు ఉండేలా చూసేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. టేకు, జామ, దానిమ్మ, ఇప్ప, కరివేపాకు, ఈత, సీతాఫలం, రేగు, కుంకుడు, పనస, వేప, నేరేడు, ఉసిరి, సీమచింత, నిమ్మ, వెదురు, జమ్మి, తంగేడు, పారిజాతం, తిప్పతీగ తదితర మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోనున్నారు. నీడనిచ్చే మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలతో బృహత్ వనాలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు. ఇందులోనే చిన్నారుల కోసం ప్రత్యేకంగా పార్కులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. కాగా, మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలో ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనంలో మొక్కలు నాటుతున్నారు.
ఇక్కడే మరో ఐదెకరాల్లో నర్సరీ ఏర్పాటు చేసి మండలం మొత్తానికి మొక్కలు సరఫరా చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి మండలానికో మెగా పార్క్ చొప్పున 16 ఏర్పాటు చేస్తున్నారు. 15 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. వనపర్తి జిల్లాలో 14 మండలాల్లో స్థల సేకరణ పూర్తయింది. రేవల్లి, పానగల్, పెబ్బేరు, మదనాపురం, అమరచింత, వనపర్తి మండలాల్లో పనులు ప్రారంభించారు. నారాయణపేట జిల్లాలో 11 మండలాలకు గానూ కోస్గి, మరికల్, కృష్ణ మండలాల్లో స్థల సేకరణ పూర్తి కాలేదు. మిగతా చోట్ల స్థల సేకరణ చేసి పనులు ప్రారంభించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 12 మండలాల్లోనూ స్థల సేకరణ పూర్తయింది. నాగర్కర్నూల్ జిల్లాలోనూ 20 మండలాల పరిధిలో స్థల సేకరణ పూర్తి చేశారు.