భద్రాచలం, ఏప్రిల్ 16: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ గావించారు. ఉగాది పర్వదినం రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. శనివారం నుంచి నవాహ్నిక బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. ఉదయం ఉత్సవ పెరుమాళ్లకు (స్వర్ణ మూర్తులకు) ఉత్సవాంగ స్నపనం జరుపుతారు.18న గరుఢ ధ్వజ పట లేఖనం, సాయంత్రం గరుడ ధ్వజ పటావిష్కరణ, గరుఢ ధ్వజాధివాసం, 19న ఉదయం అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, రాత్రికి భేరీ తాడనం, దేవతాహ్వానం, బలి సమర్పణ, హనుమద్వాహన సేవ, 20న ఉదయం యాగశాలలో పూజ, చతుఃస్థానార్చాన, రాత్రికి గరుడ వాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవం జరుపుతారు. 21న శ్రీరామనవమి ఉదయం శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం, సాయంత్రం శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం, రాత్రికి చంద్ర ప్రభ వాహన సేవ, 22న ఉదయం పట్టాభిషేకం, రాత్రికి రథ సేవ నిర్వహిస్తారు. 23 ఏకాదశి సందర్భంగా ఉదయం చతుః స్థానార్చన, రాత్రికి సదస్యం , హంస వాహన సేవ, 24న ఉదయం చతుః స్థానార్చన, రాత్రికి తెప్పోత్సవం, చోరోత్సవం అశ్వవాహన సేవ, 25న ఉదయం చతుఃస్థానార్చన, రాత్రికి ఊంజల్ సేవ, సింహ వాహన సేవ, 26న ఉదయం వసంతోత్సవం, సుదర్శన హోమం, సాయంత్రం హవనం, గజవాహన సేవ, 27న ఉదయం చతుః స్థానార్చన, సాయంత్రం 6 గంటలకు పూర్ణాహుతి, శేష వాహన సేవ, ధ్వజారోహణం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాథనలు, శ్రీ పుష్పయాగం, బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి, మే 5న ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, శాంతి హోమం, రాత్రికి తిరువీధి సేవ, 16 రోజుల పండుగ, పవళింపు సేవలు ప్రారంభం అవుతాయి. 17 నుంచి ఆలయంలో దర్బార్ సేవలు, పవళింపు సేవలు నిలిపివేస్తారు. కొవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం నవాహ్నిక మహోత్సవాలను ఆలయం ప్రాంగణంలోనే నిర్వహించనుంది.