vemulawada temple history | దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ వెయ్యేండ్ల చారిత్రక ఆధారాలతో ఇప్పుడు మన ముందు నిలిచింది. పౌరాణిక ప్రాశస్త్యాలలో యుగయుగానికి దీని గొప్పతనం కనబడుతోంది. ఆదిమ మానవులు మొదలు ఆధునికుల వరకు తిరుగుతున్న చోటు వేములవాడ. దేశంలో అతి ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. ప్రాచీన శిల్పసంపదతో ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. ఒకప్పుడు వేములవాడను కేంద్రంగా చేసుకొని చాళుక్యులలోని ఒక శాఖ పరిపాలనను ప్రారంభించింది. అందుకే వారు వేములవాడ చాళుక్యులుగా ప్రసిద్ధికెకారు. వీరు పది మంది రాజులు. దాదాపు మూడు శతాబ్దాలు రాజ్యమేలారు.
వేములవాడ చాళుక్యులు నిరంతరం యుద్ధాలు చేస్తూనే మత సంసృతీ పరిరక్షకులుగా పేరుగాంచారు. సాహిత్య వికాసానికి కృషి చేశారు. వీరు పండిత పోషకులే కాదు స్వయంగా విద్యావేత్తలు, కవులు. ఈ రాజులలో మొదటి అరికేసరి, మూడవ అరికేసరి వ్యాకరణం, సాహిత్య సంబంధిత విషయాలలో గొప్ప నిష్ణాతులు.
వేములవాడ చాళుక్యల కాలంలో సంస్కృతం, కన్నడం, తెలుగు.. మూడు భాషలు పరిఢవిల్లాయి. కన్నడం, తెలుగు భాషలకు వేములవాడ పుట్టినిల్లు అయితే , సంసృతంలో నూతన సృజనలకు ఇది కార్య క్షేత్రం.
వీరి రాజభాష కన్నడము. కన్నడ భాషకు వీరి కాలాన్ని స్వర్ణయుగం అంటారు. కన్నడ రత్న త్రయంలో ప్రథముడు, కన్నడ ఆదికవి పంపన రెండవ అరికేసరి ఆస్థాన కవి. పంపమహాకవి సంస్కృత భారతాన్ని ఆధారంగా చేసుకుని విక్రమార్జున విజయం అనే పేరుతో కన్నడ తొలి మహా కావ్యాన్ని, జైన తీర్థంకరుల చరిత్రలను వర్ణిస్తూ కన్నడంలో ఆదిపురాణమనే మరో గ్రంథాన్ని రచించారు. పంపన సోదరుడు జినవల్లభుడు కూడా కన్నడ కవి. ఆయన రచించిన కురిక్యాల శాసనం తప్ప మిగిలిన కన్నడ రచనల వివరాలు తెలియడం లేదు. కురిక్యాల శాసనాన్ని స్వయంగా ఆయనే వ్రాసి చెకించారు. దీనిలో వ్రాయబడిన ఆరు కన్నడ వృత్త పద్యాలు తొలి కాలపు సాహిత్యంగా గుర్తించబడినవి. ఈ శాసనంలో పేరొన్న వాధీభ సింహ, వాధీభ చూడామణి అనే కవులు కన్నడ భాషకు చెందినవారు. సంస్కృతం, తెలుగు భాషలలో ఈ పేర్లతో లేదా బిరుదులతో కవులు ఎవరు కనబడటం లేదు. కాబట్టి వీరు కూడా కన్నడములో రచనలు చేసి ఉండవచ్చు. కానీ వివరాలు అలభ్యం. దీనిపై మరింత పరిశోధనలు సాగాలి. ఈ విధంగా వేములవాడ కన్నడ భాష తొలి సాహిత్యానికి పుట్టినిల్లు అయి కన్నడ కవులకు నివాస క్షేత్రమైంది.
పంప మహాకవి వలెనే జినవల్లభుడు ప్రసిద్ధ జైనమతానుయాయి, ఆచార్యులు. ఈయన గంగాధర సమీపంలో త్రిభువన తిలక బసదిని నెలకొల్పి విద్యా బోధనతోపాటు, ఆయుధ శిక్షణ, జైనమత సిద్ధాంతాల వ్యాప్తికి కృషి చేస్తుండేవారు. ఈయన తన విద్యా కేంద్రానికి సమీపంలో గల కురిక్యాల గుట్ట (వృషభాద్రి) పైన ఒక పెద్ద సిద్ధశిలకు 11 పంక్తుల త్రిభాషా శాసనాన్ని రచించి చెక్కించారు. ప్రస్తుతం ఇది బొమ్మలమ్మ గుట్ట శాసనంగా పేరొందింది.
ఈ శాసనం సంస్కృతంలో ప్రారంభమై కన్నడ భాషలో సాగి చివరకు తెలుగు భాషతో ముగుస్తుంది. దీని కాలం క్రీ.శ. 945 గా గుర్తించారు. పైన చెప్పిన ఆరు కన్నడ వృత్త పద్యాలతోపాటు మూడు తెలుగు కంద పద్యాలు ఇందులో చెక్కి ఉన్నాయి. ఈ పద్యాలు అప్పటి వరకు తెలుగు ఆదికవిగా భావింపబడుతున్న నన్నయ కంటే వందేండ్ల పూర్వానివి. అంటే తెలంగాణ నేల ఎప్పటినుంచో తెలుగు భాషకు ఆటపట్టయి ఉంది. అందువల్లే జినవల్లభుడు తెలుగులో ప్రావీణ్యం సంపాదించి తొలి కంద పద్యాలు వ్రాసి ఉంటారు. జినవల్లభుడు తెలుగు ప్రాచీన కవులలో ఒకరు. ప్రస్తుత బొమ్మలమ్మగుట్ట శాసనాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు కు ప్రాచీన హోదా గుర్తింపు కోసం ఆధారంగా చూపించింది. తెలుగుకు ప్రాచీన హోదా దకడంలో ఈ శాసనం కీలకమైంది. జినవల్లభుడు చాళుక్య రెండవ అరికేసరిని ఆశ్రయించి ఉండటం, శాసనం రాయడానికి ముందు కచ్చితంగా రాజుకు వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ శాసనం కూడా వేములవాడలోనే తుది మెరుగులు దిద్దుకొని ఉంటుంది. ఈ విధంగా తొలి తెలుగు కంద పద్యాల పుట్టినిల్లు కూడా వేములవాడే. ఇదే శాసనంలో మల్లియ రేచన అనే కవి ప్రస్థావన కలదు. ఆయన కవిజనాశ్రయమనే తెలుగు ఛందో లక్షణ గ్రంథాన్ని జినవల్లభుడి ప్రోత్సాహంతో రచించినట్లు తెలుస్తున్నది.
నన్నయ కంటే చాలా ముందే తెలుగులో రచనలు చేసిన మల్లియ రేచనను తెలుగు ఆదికవిగా గుర్తించాలి. పంపమహాకవి తెలుగులో కావ్య రచనలు చేశారని కొందరు భావిస్తున్నారు. ఆయన పద్మకవి అన్న పేరుతో జినేంద్ర పురాణము వ్రాసినట్లు చెబుతున్నారు. అది నిజమైతే తొలి తెలుగు జైన కావ్యం జినేంద్ర పురాణము వేములవాడ నుండే వ్రాసినట్టు. కన్నడ, తెలుగు భాషల వైభవానికి పునాదులు వేసిన అద్భుత క్షేత్రం వేములవాడ.
సంసృత భాష నూతన ఒరవడుల శ్రీకారానికి వేములవాడ చాళుక్యులు ప్రోత్సాహమిచ్చారు. ఉత్తరాది నుండి జైన మత అధ్యయనానికై వచ్చి ఇకడే స్థిరపడిన కవి, జైనమతాచార్యులు సోమదేవసూరి. ఈయన సంస్కృతంలో అశ్వఘోశుడు, కాళిదాసు, బాణ వంటి వారి కోవకు చెందినవారు. వాగరాజు, రెండవ బద్దెగుడు, మూడవ అరికేసరిల ఆస్థానాలలో సోమదేవసూరి కవిగా ఉన్నారు. వేములవాడలో నిర్మించిన శుభదామ జినాలయమునకు స్థానాధిపతిగా వీరిని రెండవ బద్దెగుడు నియమించారు. సంస్కృత తొలి చంపూ కావ్యాలలో ఒకటిగా భావిస్తున్న యశస్తిలకచంపువును సోమదేవసూరి రచించారు. గుణాఢ్యుడు రచించిన బృహతథను సంస్కృతంలో కథాసరిత్సాగరం పేరుతో అనువదించారు. నీతి వాక్యామృతం, షణ్ణవతి ప్రకరణం, మహేంద్ర మాతలి సంజల్పం, యుక్తి చింతామణి సూత్ర, శాద్వాదోపనిషత్ వంటి సంస్కృత గ్రంథాలను వ్రాశా రు. నీతి వాక్యామృతం కౌటిల్యుని అర్థశాస్త్రంను పోలి మధ్య యుగంలో ప్రతివ్యక్తి ఆచరించ దగిన ధర్మాలను వివరించింది. సోమదేవసూరి సాహిత్యంపై పరిశోధన చేసిన కె.కె. హాండిక్వి భారత దేశ సాహిత్య చరిత్రలోనే వీరు సాటిలేని మేధా సంపన్నులని పేరొన్నారు.
ఇక జినవల్లభుడు కురిక్యాల శాసనంలోని మూడు సంస్కృత పద్యాల రచనే గాక మహావీర స్వామి స్తోత్రం అనే సంస్కృత గ్రంథాన్ని కూడా రచించారు. వీరితో పాటు మల్లికార్జునుడు, వ్యక్తిలింగి, విద్యారాశి, వాఖ్యాన భట్టారకుడు, పెద్దన భట్టు మొదలగు సంస్కృత పండితులు ఈ ఆస్థానంలో కలరు. కానీ వీరి రచనలు ఇప్పుడు లభించడం లేదు. ఇలా సంస్కృతంలో నూతన పోకడలకు వేములవాడ పుట్టినిల్లయింది.
వేములవాడ చాళుక్యులు సాహిత్య పోషణను ఒక భాషకో, ప్రాంతానికో, మతానికో పరిమితం చేయలేదు. జైన, బౌద్ధ, వైదిక భేదాలు లేకుండా అన్ని మతాలను ఆదరించారు. అందుకే తెలంగాణ మాగాణంలో సంస్కృతం, కన్నడం, తెలుగు భాష; జైన, వైష్ణవ, శైవ, శాక్తేయ మతాలు సరిసమానంగా విరాజిల్లాయి.
– డాక్టర్ సందెవేని తిరుపతి
చరిత్ర పరిరక్షణ సమితి
9849618116
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ganesha in world | విదేశాల్లో మన వినాయకుడు.. ఏ దేశంలో ఏ పేరుతో పిలుస్తారంటే..
ganesh chaturthi | గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారు?
ganesh chaturthi | కాణిపాకానికి ఆ పేరెలా వచ్చింది? స్థల పురాణమేంటి?
గాంధారి మైసమ్మ | మేడారం జాతరలాగే రెండేండ్లకొకసారి జరిగే ఆదివాసీల జాతర గురించి తెలుసా
కృష్ణాష్టమి 2021 | ఆ గుళ్లో పూజలు చేస్తే పిల్లలు పుడతారట.. భక్తుల విశ్వాసం
మూడు భాషలకు నెలవుగా ముక్కంటి క్షేత్రం.. మనకు తెలియని వేములవాడ చరిత్ర ఇదీ..