‘గాంధారి ఖిల్లా’.. విభిన్న సంస్కృతుల నిలయం. అబ్బురపరిచే శిల్ప సంపదకు, చారిత్రక విశేషాలకు కేంద్రం. గోండులు, మన్నెలు, మెకాసి, నాయక్ పోడ్లు, కోయ గిరిజనుల ఆరాధ్య దైవం ‘ గాంధారి మైసమ్మ ’ కొలువైన క్షేత్రం. ప్రతి రెండేండ్లకు ఒకసారి ఇక్కడ జరిగే జాతర.. ఆదివాసీల ఐక్యతకు నిదర్శనం.
మంచిర్యాల జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉంది.. ‘గాంధారి ఖిల్లా’. వెయ్యేండ్లకు పూర్వమే ఈ కోట నిర్మితమైంది.‘గాంధారి’ కోట కేంద్రంగా గోండు రాజులు పాలించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. అయితే, రాష్ట్రకూటులు మొదలు కాకతీయుల వరకూ వివిధ పాలకులు వేయించిన శాసనాలు, చెక్కించిన శిల్పాలు అక్కడ దర్శనమిస్తున్నాయి. కొండల వరుసను శత్రుదుర్భేద్యంగా మార్చి, బలమైన కోటగా తీర్చిదిద్దారు. పలు రాతి కొండలను తొలిచి, మెట్లు మలిచారు. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. గుర్రాలు, ఏనుగులు వెళ్లడానికి ఓ ప్రత్యేక మార్గం ఉండటం విశేషం. గిరిజనుల ఇలవేల్పు ‘గాంధారి మైసమ్మ’ కూడా ఇక్కడ కొలువై ఉన్నది. అమ్మవారితోపాటు భైరవుడు, శివుడు, వేంకటేశ్వరుడు, ఆంజనేయుడి విగ్రహాలూ దర్శనమిస్తాయి.
‘గాంధారి జాతర’ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆ సందర్భంగా మూడు రోజులు జరిగే ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకొంటాయి. సంప్రదాయ నృత్యాలు అబ్బుర పరుస్తాయి. గిరిజన ‘దర్బార్’ చూసి తీరాల్సిందే! స్థానిక మెకాషీలు ఏటా దసరా, పుష్య వైశాఖ మాసాల్లో మైసమ్మ దేవతను పూజిస్తారు. గాంధారి కోటను పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే కోట సమీపంలోని అటవీ ప్రాంతాన్ని గాంధారి వనంగా తీర్చిదిద్దింది. జింకల పార్కు, హెర్బల్ గార్డెన్, నవగ్రహ వనం, రాశివనం, పిల్లల పార్కు ఏర్పాటు చేసింది. జరగాల్సింది ఇంకా ఉంది.
-అరవింద్ ఆర్య ,7997 270 270
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pregnancy Tips | ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు?
bullettu bandi | బుల్లెట్టు బండి పాట పాడింది మోహన.. మరి రాసింది ఎవరో తెలుసా?
శ్రీదేవి సోడా సెంటర్ ఆనందికి పెళ్లయిందా?
చేతులను ఎందుకు 20 సెకన్లు శుభ్రంచేసుకోవాలి?