Kaleshwaram | తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసిన సందర్భంగా 1955-56లో విద్యార్థులు, విద్యావంతులు, చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, జేవీ నర్సింగారావు వంటి నాయకులు వారి శక్తిమేరకు నిరసనలు, ధర్నాలు, బంద్లు నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి ఉద్యమాలు జరుగలేదు. దీనికి కారణం ఆంధ్రాతో కలిస్తే కృష్ణా, గోదావరి జలాలు మనకు దక్కకుండా ఆంధ్రాకు తరలిస్తారని, నిజాం పాలనలో మీర్ నవాబ్ అలీ నవాజ్ బహదూర్ రూపొందించిన ప్రాజెక్టులను ఆపేస్తారని రైతాంగానికి, తెలుగు భాషపై మక్కువతో ఒక్కటవుదామని భావించిన కాళోజీ, దాశరథి వంటి కవులకు, కమ్యూనిస్టులకు తెలియదు. నిజంగానే ఆ సోయి వారికి ఉంటే తెలంగాణ ఉద్యమం ఎన్నో రెట్లు ఉధృతంగా సాగి ఉండేది, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు నెహ్రూ సాహసించి ఉండకపోయేవారు.
2001 దాకా జయశంకర్, జాదవ్, మాలాంటి విద్యావంతులం ఎందరమో తెలంగాణ సోయితో ఉద్యమాన్ని రాజేయడానికి ఎంత ప్రయత్నించినా జనం పెద్ద ఎత్తున కదలలేదు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తూ ఆ సభల్లో నిరక్షరాస్యులైన రైతాంగానికి, చేతివృత్తుల వాళ్లకు, అణగారిన వర్గాల ప్రజలకు విపులంగా అర్థమయ్యేలా తెలంగాణ నుడికారంతో, సామెతలతో ఆంధ్రుల వలస దోపిడీ గురించి అర్థం చేయించిన తర్వాతే పెద్ద ఎత్తున జనం తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు.
తెలంగాణ సోయి ప్రజలకు వచ్చింది కానీ, జలయజ్ఞం పేరుతో వైఎస్సార్ నీళ్లు రావడానికి అవకాశం లేని ప్రాజెక్టులను తెలంగాణలో ఎలా నిర్మించాలని వేల కోట్లు ఖర్చుచేసింది, వాటిని నిష్ప్రయోజనం కానివ్వకుండా తెలంగాణ సాగునీటి అవసరాల కోసం రీ-డిజైనింగ్ కేసీఆర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగింది తదితర విషయాలపై మరోసారి తెలంగాణ గ్రామీణ ప్రజలకు, లబ్ధిదారులైన రైతులకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత తెలంగాణ కోసం ఉద్యమించినవారిపై, తెలంగాణ పునర్నిర్మాణంలో వివిధ హోదాలలో ఉంటూ భాగస్వాములైన వారందరిపై ఉన్నది.
ఉద్యమానంతరం వచ్చిన తెలంగాణలో లభించిన ఉద్యమ ఫలితాలను పరిరక్షించుకోవాల్సిన తరుణం ఇది. ప్రజలకు వాస్తవాలు తెలపాల్సిన శాసనసభను సాక్షాత్తూ ముఖ్యమంత్రే అబద్ధాల ప్రచారవేదికగా మార్చడం బాధాకరం.
అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డపై సీఎం ఆడిన అబద్ధాలివీ… సీఎం రేవంత్రెడ్డి 2024 ఫిబ్రవరి 17న శాసనసభలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రిటైర్డ్ ఇంజినీర్లు ఎం.శ్యాంప్రసాద్రెడ్డి, ఎస్.చంద్రమౌళి, బి.అనంతరాములు, పి.వెంకటరామారావులు మేడిగడ్డ బ్యారేజీని వ్యతిరేకించారని చెప్తూ ఇంజినీర్ల రిపోర్టులోని 13వ పేజీ చివరి పేరాలోని కొన్ని పదాలను వదిలేసి తనకనుకూలంగా ఉన్న పదాలను చదివారు.
ఆ పేరా ఇలా ఉంది.. The proposal of construction of barrage on main Godavari near Medigadda (V) and Lifting 160 TMC of Water to Mid Manair Reservoir is not desirable due to its prohibitive cost and time consumption. ఈ మాటలను మేడిగడ్డ వద్ద బ్యారేజీ వాంఛనీయం కాదని తన వాదనలకు అనుకూలంగా వక్రీకరించారు. గోదావరిపై మేడిగడ్డ వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణం ద్వారా 160 టీఎంసీల నీటిని మిడ్ మానేరు రిజర్వాయర్కు ఎత్తిపోయడం ‘ప్రొహిబీటివ్ కాస్ట్, టైం కన్జంప్షన్’ వల్ల వాంఛనీయం కాదు అనేది పై మాటల సారాంశం.
ఇంజినీర్ల రిపోర్టులోని కొన్ని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. రిపోర్టు 4వ పేజీలోనే ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి గోదావరి నదిపై ప్రత్యామ్నాయ స్థలాన్ని మేడిగడ్డ గ్రామం వద్ద నుంచి మిడ్ మానేరు దాకా అధ్యయనం చేయ’మని కోరారు. రిపోర్టు 5వ పేజీలో.. ‘2015, మార్చి 24న రిటైర్డ్ ఇంజినీర్లు ఫోరం సభ్యులు ఏరియల్ సర్వే ద్వారా బ్యారేజీకి ప్రత్యామ్నాయ స్థల పరిశీలన చేశారు.’
రిపోర్టు 6, 7 పేజీల్లో ‘మహదేవపూర్ మండలం మేడిగడ్డ గ్రామం వద్ద గోదావరి నదిపై 5 టీఎంసీల నీటిని నదిలో నిల్వ చేస్తూ 160 టీఎంసీల నీటిని నేరుగా మిడ్మానేరుకు ఎత్తిపోసే అవకాశాల గురించి పరిశీలించమని నీటి పారుదల శాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.’
‘ఏరియల్ సర్వే ద్వారా ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించాక గోదావరి నది ఇక్కడ తక్కువ వెడల్పుతో ప్రవహిస్తున్నందున బ్యారేజీ నిర్మాణం ఆచరణ సాధ్యమే. టోపో స్టడీ ప్రకారం.. మహారాష్ట్రలో పట్టా భూములకు ముంపు లేకుండా చేయవచ్చు. (ఇంజినీర్ల రిపోర్టు 6వ పేజీ చివరి పేరా).’ మేడిగడ్డ వద్ద 10-12 టీఎంసీల నిల్వతో +105 మీటర్ల ఎత్తులో బ్యారేజీని రిటైర్డు ఇంజినీర్లే తమ రిపోర్టులో గోదావరిపై ప్రతిపాదించిన మొత్తం 6 బ్యారేజీలలో భాగంగా రిపోర్టులోని 10వ పేజీ చివరి పేరాలో పేర్కొన్నారు. ఇంత స్పష్టంగా తమంతట తామే మేడిగడ్డ వద్ద బ్యారేజీని 10 టీఎంసీలతో నిర్మించాలని రిటైర్డు ఇంజినీర్లు ప్రతిపాదిస్తే, అది తెలిసి కూడా రేవంత్రెడ్డి ఇంజినీర్లు ‘బ్యారేజీ సాధ్యం కాదన్నా’రని సభను తప్పుదోవ పట్టించారు. రిటైర్డ్ ఇంజినీర్లను అప్పటి సీఎం కేసీఆర్ పరిశీలించమని అడిగింది మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించే అవకాశం, 160 టీఎంసీల గోదావరి జలాలను బ్యారేజీ నుంచి నేరుగా పైపుల ద్వారా, టన్నెల్ ద్వారా (సొరంగమార్గం), గ్రావిటీ కాల్వల ద్వారా మిడ్మానేరు వరకు ఎలా తేవచ్చునో అధ్యయనం చేసి చెప్పమని!
ఇందులో మేడిగడ్డ వద్ద గోదావరిపై బ్యారేజీ ఆచరణ సాధ్యమేనని రిటైర్డ్ ఇంజినీర్లు తమ రిపోర్టులో స్పష్టం చేశారు. ఈ ఐదుగురిలో ఎవరినడిగినా అదే విషయం ఇప్పుడూ చెప్తారు. రిటైర్డ్ ఇంజినీర్లు సాధ్యం కాదని కేసీఆర్కు తేల్చిచెప్పింది మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు గోదావరి జలాలను తరలించడం. ఎందుకంటే ఆ దారిలో తాడిచర్ల బొగ్గు గనులు, సింగరేణి ఓపెన్కాస్ట్ గనులు, గోదావరిఖని పట్టణం మొదలగునవి ఉండట మే దీనికి కారణం. తమ రిపోర్టులోని 7, 8 పేజీల్లో ఇది స్పష్టం చేశారు. ఈ రిపోర్టులోని అంశాలను కేసీఆర్ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది కాబట్టే మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు జలాలను నేరుగా తరలించే ప్రతిపాదనను ఉపసంహరించుకొని ప్రముఖ దివంగత ఇంజినీర్ టి.హన్మంతరావు (స్టెప్లాడర్ టెక్నాలజీ) ప్రతిపాదించిన గోదావరిలోనే రివర్స్ పంపింగ్ అనే టెక్నాలజీని అమలుచేసింది. ఆయన మేడిగడ్డకు కొద్దిగా ఎగువనున్న సూరా రం వద్ద బ్యారేజీని ప్రతిపాదించాడు. డబ్ల్యూపీసీఓఎస్ వాళ్లు మేడిగడ్డ వద్ద బ్యారేజీని ఫైనల్ చేశారు.
రిటైర్డ్ ఇంజినీర్ల నివేదికలో 105 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలోని కొన్ని నదీసమీప గ్రామాలకు వరదలు సంభవించినప్పుడు ముంపు సమస్య ఉండవచ్చని పేర్కొనడంతో బ్యారేజీ ఎత్తును 100 మీటర్ల ఎత్తులో నిర్మించారు. రిటైర్డ్ ఇంజీనీర్లు మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఆచరణ సాధ్యమనే చెప్పినా సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో ఇంజినీర్ల నివేదికలోని అంశాలను వక్రీకరించినట్లు, అబద్ధాలు, అర్ధ సత్యాలు చెప్పినట్లు స్పష్టమవుతున్నది.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించిన రిటైర్డ్ ఇంజినీర్లు అనంతరాములు, వెంకటరామారావు ఈ కమిటీలో సభ్యులు. ఎలాగైనా మహారాష్ట్రను ఒప్పించి 151 మీటర్లు లేదా +150 మీటర్ల ఎత్తులో తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని, ఒకవేళ మహారాష్ట్ర అంగీకరించకపోతే ప్రాణహిత నదిపై (తుమ్మిడిహెట్టికి దిగువన) వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్ర-తెలంగాణలో ముంపు ఉండదని ప్రభుత్వానికి సూచించారు.
ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులోని ప్యాకేజీ 1,2, 4 (తుమ్మడిహెట్టి నీటి సరఫరా కోసం నిర్మించిన కాల్వలు మొదలైనవి)లోని కొన్ని పనులు 2014 నాటికే పూర్తయినందున వాటిని వినియోగించుకోవడానికి వార్ధానదిపై (తుమ్మిడిహెట్టికి ఎగువన) బ్యారేజీ నిర్మించాలని రిటైర్డ్ ఇంజినీర్లు ప్రభుత్వానికి సూచించారు. ఈ సూచనలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం వార్ధానదిపై బ్యారేజీని ప్రతిపాదిస్తూ డీపీఆర్ను కేంద్రానికి పంపింది.
కాళేశ్వరమంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజేనా?
కాంగ్రెస్ ప్రభుత్వానికి రంధ్రాన్వేషణపై, గత ప్రభుత్వంపై బురదచల్లడంపై ఉన్న శ్రద్ధ తొమ్మిదిన్నరేండ్లుగా తెలంగాణలో సృష్టించిన సంపదపై లేదు. ఇటీవల సీఎం, మంత్రులు తమ పార్టీ శాసనసభ్యులను వెంటబెట్టుకొని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించారు. ఒక గ్లాసులో సగం నీరుంటే నెగెటివ్ మనస్తత్వం ఉన్న వ్యక్తి సగం ఖాళీ ఉందని అంటే పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి సగం నీరుందని సంతోషపడుతాడు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో మొత్తం 227 పియర్స్ ఉంటే అందులో మేడిగడ్డ 7వ బ్లాకులో దెబ్బతిన్న రెండు పియ ర్స్ వద్దకు వెంట వచ్చిన వారిని తీసుకెళ్లిన ముఖ్యమంత్రి వాటికి గల పగుళ్లను చూపించి రాక్షసానందాన్ని పొందిన దృశ్యాలు టీవీల్లో చూశాం. కాళేశ్వరంలో 99.99 శాతం నిర్మాణాలు సురక్షితంగా ఉన్న అంశం ఏనాడూ సీఎంగా నీ, నీటిపారుదల శాఖ మంత్రి గానీ ప్రస్తావించరు. వారి నెగెటివ్ ధోరణికి మేడిగడ్డ పర్యటన అద్దం పడుతున్నది.
రాష్ట్ర ప్రయోజనాల పట్ల, రైతాంగానికి సాగునీరందించడం పట్ల ఏ మాత్రం ఆసక్తి ఉన్నా దెబ్బతిన్న ఏడో బ్లాకును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేవిధంగా గత 80 రోజుల్లో అనేక చర్యలు చేపట్టి ఉండేవారు. తెలంగాణలోని సుమారు 37 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును ఏ దురాలోచనతో సీఎం విస్మరించినా అది తన గొయ్యిని తాను తవ్వుకోవడమేనని గుర్తుచేస్తున్నాను.
అప్పులు-ఆర్థిక ప్రగతి: గత ప్రభుత్వం చేసిన రూ.6 లక్షల కోట్ల అప్పుల గురించి, ఏటా చెల్లించాల్సిన వడ్డీల గురించి పదే పదే నోరు పారేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్.. కేసీఆర్ పాలనలో రూ. 60 వేల కోట్లకు లోపే ఉన్న ఆదాయాన్ని రూ.2 లక్షల కోట్లకు చేర్చిన విషయాన్ని కూడా గమనించాలి. తన సొంత పార్టీ లేదా పెంచిన పార్టీలే యాభై ఏడేండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాలంలో ఏ పదేండ్లలోనైనా నాలుగు రెట్లు రాష్ట్ర ఆదాయాన్ని పెంచారా? అప్పు తేకుంటే ప్రగతి ఎలా సాధ్యం? దుప్పటి ఎంతుంటే కాళ్లు అంతే చాపుకుంటానని ఏ ముఖ్యమంత్రి అయినా భావిస్తే అతనికి లోకజ్ఞానం శూన్యమేనని భావించాలి. ఇటీవలే ప్రపంచ ఆర్థిక సదస్సుకు దావోస్కు వెళ్లివచ్చిన సీఎం 21వ శతాబ్దంలో ఆర్థిక ప్రగతికి విదేశాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ఏ విధంగా అర్థం చేసుకున్నారో తెలియడం లేదు. మనమంతా బాగా అభివృద్ధి చెందిన దేశంగా పిలుచుకునే అమెరికాకు ఉన్నంత అప్పు ప్రపంచంలోని సుమారు 150 దేశాల మొత్తం అప్పు కన్నా ఎక్కువే.
అప్పులు చేయడం తప్పు కాదు. తెచ్చిన అప్పును ఉత్పాదకరంగంపై పెట్టుబడిగా పెడితే ఆదాయం ఎన్నో రెట్లు పెరుగుతుంది. తెచ్చిన అప్పును-అనుత్పాదక రంగాలపై ఖర్చుచేస్తే ఆదాయం పెరుగకపోగా అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పు చేయాల్సి వస్తుంది. కాళేశ్వరం కోసం కేసీఆర్ చేసిన అప్పు అదే ప్రాజెక్టుపై వ్యయం చేశారు. పట్టికలో చూపిన 18 రిజర్వాయర్లలో గంధమల్ల తప్ప అన్నీ పూర్తయ్యాయి. వీటితో పాటు కాళేశ్వ రం ప్రాజెక్టు 7 లింకులలో గల 28 ప్యాకేజీలలో ప్రవా హ కాల్వలు, సొరంగాలు, పంపింగ్ (లిఫ్ట్) స్టేషన్లు, బ్యారేజీలు, వేలాది డిస్ట్రిబ్యూటరీలు, నిర్మాణాలు, 22 విద్యుత్ సబ్స్టేషన్లు, సర్జ్పూల్లు, చాలావరకు భూ సేకరణ, నిర్వాసితుల పునరావాసం, సుమారు రెండు వేలకు పైగా చెరువులను, వందలాది వాగులను కాళేశ్వరంతో అనుసంధానం చేయడం, వందలాది చెక్డ్యాంలను నిర్మించడం మొదలైన వాటిపై అప్పుల ద్వారా దేశీయ బ్యాంకులిచ్చిన రూ.వేల కోట్లను, రాష్ట్రంలో ఏటా పెరుగుతూ వచ్చిన ఆదాయాన్ని కలిపి రూ.93 వేల కోట్లు ఖర్చు చేశారు. దీని ఫలితమే ఐదారు రెట్లు పెరిగిన ధాన్యం ఉత్పత్తులు. 2019, జూన్ 21న కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. 2019 రబీ పంటల నుంచి 2023 రబీ పంటల దాకా కాళేశ్వరం నీళ్లతో ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు పండాయో పట్టిక చూస్తే తెలుస్తుంది.
నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డి పదే పదే చెప్పే మాట రూ.93 వేల కోట్లు ఖర్చుచేసి 97 వేల ఎకరాలకు నీళ్లిచ్చారు అని (నిజానికి 2019 రబీ నుంచి 2023 రబీ వరకు 60లక్షల ఎకరాలకు కాళేశ్వరం జలాలు ఇచ్చారు). అంటే ఒక ఎకరానికి రూ.కోటి ఖర్చు చేశారని! రాష్ట్ర ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించడానికి అసెంబ్లీనే అబద్ధాల వేదికగా మార్చిన మరో అబద్ధమిది. ఎన్ని ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీరందిందో పట్టిక ద్వారా వెల్లడవుతున్నది. ఈ పట్టిక రాష్ట్ర నీటి పారుదల శాఖ కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రానికి పంపిన డ్రాఫ్ట్ పెర్ఫార్మెన్స్ నివేదిక 2023-2024 నుంచి తీసుకున్నదే.
ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఎక్కువ వ్యయమయ్యేది డ్యాంలు, బ్యారేజీలు, కిలోమీటర్ల పొడవు రాతి/ మట్టికట్టలు, గేట్లు, యంత్రాలు, లిఫ్టులు, సొరంగాలు, పైపు లైన్లు ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రధాన తూములు, భూ సేకరణ, నిర్వాసితుల పునరావాసం, రకరకాల నిర్మాణ పనులు, పనిచేసేవారి కోసం నివాస గృహాలు, వర్క్షాపులు, భారీ వాహనాలు, ముడి సరుకైన మట్టి, మొరం, సిమెంట్, ఇనుము, కంకర మొదలైన వాటిపై సుమారు 80-90 శాతం వ్యయం చేసిన తర్వాత పంట కాల్వలపై దృష్టిపెట్టి పొలాలను సాగునీరందిస్తారు. నెహ్రూ చేతుల మీదుగా కాంగ్రెస్ పాలనలో 1955లో మొదలైన నాగార్జున సాగర్ నిర్మాణం సుమారు ఆరు లక్షల ఎకరాలకు పైగా ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉండగా 12 ఏండ్ల తర్వాత 90 వేల ఎకరాలకు కూడా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నీరివ్వలేదు. 1963లో నాటి ప్రధాని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే 1977లో 25 వేల ఎకరాలకే అప్పటి ముఖ్యమంత్రి నీరందించారు. అప్పటికే ఈ ప్రాజెక్టులపై 80-90 శాతం నిధులు ఖర్చయ్యాయి. వీటితో పోలిస్తే కాళేశ్వరంలోని 90 శాతం పనులు మూడేండ్లలోనే కేసీఆర్ పూర్తిచేసి ప్రాజెక్టు వ్యయం పలు రెట్లు పెరగకుండా పొదుపు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వైఎస్, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ఎనిమిదేండ్లలో 1-2 శాతం పనులు పూర్తిచేస్తే కేసీఆర్ మూడేండ్లలో (2017-19) 80 శాతం పనులు పూర్తిచేశారు. ఒకవేళ కాంగ్రెస్ పాలనే కొనసాగి ఉంటే రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి హెడ్వర్క్స్కు సంబంధించి ఎలాంటి బరాజ్ లేకుండానే సుమారు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేసి మహారాష్ట్రతో రోజూ తగవులాడే వాళ్లే తప్ప ఒక్క ఎకరానికి కూడా నీళ్లిచ్చేవారు కాదు. కేంద్రంలో, మహారాష్ట్రలో తమ పార్టీ పాలన ఉన్నా ఏడేండ్లలో తుమ్మిడిహెట్టి బరాజ్కు అనుమతి తేలేకపోయారు. ప్రత్యామ్నాయం కూడా ఆలోచించలేదు. కానీ, రూ.11 వేల కోట్లకు పైగా వివిధ పనులపై ఖర్చు చేశారు.
భూ సేకరణ, ఇతర పనుల కోసం కాళేశ్వరంపై మరో రూ.10-15 వేల కోట్లు ఖర్చు చేస్తే ఏడాది, రెండేండ్లలోపే మిగిలిన 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉన్నది. అన్ని ప్రధాన పనులు పూర్తి కాగా కొన్ని ప్రాంతాల్లో రైతులు ఎక్కువ పరిహారాన్ని కోరుతున్నందున భూ సేకరణ పెండింగ్లో ఉన్నది. చాలా పనులు 80-90 శాతం పూర్తయ్యాయి. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు నా ఉద్యమ సహచరుడు వెదిరె శ్రీరాం మీడియాకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ‘తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉండె’నని మాట్లాడారు. కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో (2015 మార్చి) ‘తుమ్మడిహెట్టి వద్ద లభ్యమయ్యే జలాలు 165 టీఎంసీలు. దీనిలో 63 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఎగువ రాష్ర్టాలు వినియోగించుకోవలసిన జలాలు. తెలంగాణ 102 టీఎంసీలను వినియోగించుకోవచ్చు’నని స్పష్టం చేసింది.
అంతేగాక ‘+148 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ నిర్మిస్తే దాని నీటి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలే కనుక రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలంటే 44 టీఎంసీల కన్నా మించి లభ్యం కాద’ని కూడా కేంద్ర జల సంఘ నిపుణులే చెప్పారు. ‘14 టీఎంసీలను డీపీఆర్లో చూపి 160 టీఎంసీలను ఎలా నిల్వ చేస్తారు? నీటి నిల్వ కోసం రిజర్వాయర్లను నిర్మించుకోవాల’ని సలహా ఇచ్చింది కూడా కేంద్ర జల సంఘమే.
బీజేపీని లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కించే ఉద్దేశంతోనే వెదిరె శ్రీరాం గత బీఆర్ఎస్ పాలనపై బురద జల్లడానికి ఈ మీడియా సమావేశం నిర్వహించారనేది స్పష్టం. ఎవరు ఏం మాట్లాడినా తెలంగాణ ప్రజల దారిద్య్రంపై సంధించిన జలాస్త్రమే మన కాళేశ్వరం!
(వ్యాసకర్త: చైర్మన్, ఇండియన్ పెనిన్సులర్ రివర్ బేసిన కౌన్సిల్)
– వి.ప్రకాశ్
90009 50400