‘విద్యుత్ చట్టం-2003’ను సవరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్షాలు, రైతు, ఉద్యోగ సంఘాలు ఈ విద్యుత్ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యుత్ వ్యవస్థల్లో నిర్వహణా లోపాలు పెరగడం, పంపిణీ సంస్థల నష్టాల కారణంగా వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సేవలకు ఐచ్ఛికాల కల్పన, పర్యావరణహిత విద్యుత్ ప్రాధాన్యం కల్పిస్తూ స్థిరమైన విద్యుత్ వృద్ధే లక్ష్యంగా సవరణలు ప్రతిపాదిస్తూ విద్యుత్ సవరణ బిల్లు 2021 తెచ్చినట్లుగా కేంద్రం చెప్తున్నది.
ప్రైవేటుసంస్థల అంతిమలక్ష్యం లాభార్జన. తక్కువ జీతాలిస్తూ, తక్కువ మంది ఉద్యోగులతో, తగినస్థాయి విద్యార్హత, కనీస శిక్షణ లేనివారితో విద్యుత్ ప్రమాణాలు ఏ రకంగా పెంచగలరు? కేవలం కరెంటు స్తంభం నుంచి వినియోగదారుని ప్రాంగణం వరకు ఉన్న నెట్వర్క్ అంటే మొత్తం నెట్వర్క్లో 10 శాతమే ప్రైవేటు సంస్థలు నిర్వహించి మిగతా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్రభుత్వసంస్థలు నిర్వహించినప్పుడు ఏ విధంగా నిర్వహణ లోపాలు తగ్గించబడతాయి? ప్రైవేటీకరణ అయిన తొలినాళ్లలో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారుల విస్తృతి పెంచుకొని తర్వాతికాలంలో ఛార్జీలను పెంచి విద్యుత్ పంపిణీ చేయడాన్ని ఢిల్లీ, ముంబై, నాగపూర్ తదితర నగరాల్లో చూడవచ్చు.‘కాస్టు టు సర్వ్’ పద్ధతిలో సేవలు అందించాలనే ప్రతిపాదన వల్ల గ్రామీణ వ్యవసా య వినియోగదారులు ఉత్పత్తి కేంద్రాల నుంచి ఎక్కువ దూరం ఉండటం, వినియోగదారుల సాం ద్రత తక్కువగా ఉండటంవల్ల లైన్లోని నష్టాలకు కూడా బిల్లులు వసూలు చేయాల్సి వస్తున్నది. దీంతో చార్జీల భారం విపరీతంగా పెరుగుతుంది.
‘క్రాస్ సబ్సిడీ’ ఎత్తివేయాలనే ప్రతిపాదన వల్ల గ్రామీణ పేద మధ్య తరగతి వినియోగదారుల వద్ద తక్కువ చార్జీలు వసూలు చేసే అవకాశం లేదు. దీంతో బిల్లుల భారం పెరిగి, మెజారిటీ గ్రామీణ ప్రజానీకం విద్యుత్ వినియోగానికి దూరమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా సబ్సిడీని ఇవ్వాలనే ప్రతిపాదనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు నెలవారీగా ఆర్థికభారం మోయాల్సి వస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు క్రమేణా సబిడ్సీలను తగ్గించటం, లేదా ఎత్తివేసే దిశగా అడుగులు వేయాల్సి వస్తుంది. కేంద్రం తెస్తున్న విద్యుత్ సం స్కరణల వల్ల తెలంగాణలో ఉచిత విద్యుత్ పొం దుతున్న 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లపై ఎకరానికి రూ.1500 నెలవారీగా చార్జీల భారం పడుతుంది. 200 యూనిట్ల కన్నా తక్కువగా వినియోగిస్తున్న 60 లక్షల పేద, మధ్యతరగతి వినియోగదారులు కూడా విద్యుత్ రాయితీలను కోల్పోయే ప్రమాదమున్నది.
కేంద్రం చేస్తున్న విద్యుత్ సంస్కరణలను 12 రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ, కేరళ రాష్ర్టాలైతే అసెంబ్లీ సాక్షిగా బిల్లును వ్యతిరేకిస్తూతీర్మానాలు చేశాయి. అయినా ప్రజా వ్యతిరేక విధానాలకు చట్టబద్ధత కల్పించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం శోచనీయం.
రెన్యువబుల్ పవర్ పర్చేస్ ఆబ్లిగేషన్ (RP PO) ప్రతిపాదన వల్ల మొత్తం విద్యుత్ వినియోగంలో కనీసం 10-30 శాతం కచ్చితంగా పునరుత్పాదక విద్యుత్ వినియోగించాలి. మన దేశ స్థాపి త సామర్థ్యం 384 గిగావాట్లు, అందులో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 240 గిగావాట్లు. సరాసరి దేశ వినియోగం కేవలం 150 గిగావాట్లు. అంటే ఇప్పటికే 90,000 మెగావాట్ల థర్మల్ విద్యు త్ కేంద్రాలకు పనిలేదు. గమనించాల్సిదేమంటే మొత్తం లక్ష మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్లో 93 వేల మెగావాట్లు ప్రైవేటు సంస్థలదే. ప్రతిపాదిత RPPO వల్ల రాష్ర్టాలు ప్రైవేటు పునరుత్పాదక విద్యుత్ను కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీం తో లక్ష 40వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు పనిలేకుండాపోతుంది. కేవలం ప్రైవేటు సంస్థలకు వ్యాపారాన్ని సమకూర్చి, ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నిర్వీర్యం చేయడమే కేంద్ర ప్రభుత్వ అంతర్లీన ఎజెండాగా కనపడుతున్నది.
స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ నియామకాలు, టారిఫ్ నిర్ణయాధికారం, రెన్యువబుల్ ఎనర్జీ పాల సీ, కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్రం ఏకపక్షంగా నిర్వీర్యం చేస్తున్నది. విద్యుత్ అంశం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో భాగం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలున్నా కేంద్రం చేసే చట్టానికి లోబడే రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సి ఉంటుంది. చట్టం కేంద్రం చేసినా అంతిమంగా అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, భరించాల్సింది ప్రజలే. అలాంటప్పుడు ప్రజా ఉద్యోగసంఘాల అభిప్రాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయా న్ని కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం కేంద్ర ఆధిపత్య ధోరణికి నిదర్శనం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
ఇప్పటికే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి పేద, మధ్యతరగతి జీవితాలు కుదేలవుతున్నాయి. ఈ తరుణంలో కరెంట్ చార్జీలు పెరిగితే ప్రజలు తీవ్ర ఆర్థిక భారానికి గురికావల సి వస్తుంది.సంపాదనంతా కనీస అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. కరెంటును కనీస ప్రజా అవసరంగా గుర్తించి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కానీ కార్పొరేటీకరణ వైపు ఈ రంగాన్ని తీసుకెళ్లి ప్రభుత్వ, ప్రజల ధనాన్ని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయటం గర్హనీయం.
(వ్యాసకర్త: జనరల్ సెక్రెటరీ, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్)
అనిల్కుమార్ మోకురాల