కేరళ రాష్ట్రం నుంచి ‘కిటెక్స్’ అనే కంపెనీ తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్టు ఓ దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఆ వార్త చదివిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ కంపెనీ సీఈఓ వివరాలు తెలుసుకొని మరీ ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఇక్కడి పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, వ్యాపారానికి ఎటువంటి అడ్డంకుల్లేని రాష్ట్ర పాలసీని భరోసా ఇచ్చారు. దీంతో కొన్నిరోజుల గడువులోనే 2400 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ‘కిటెక్స్’ కంపెనీ ముందుకువచ్చింది. ఈ కంపెనీ మన రాష్ర్టానికి రావడంతో 22 వేల మందికి ప్రత్యక్ష, దాదాపు 18 వేల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు రావడానికి మంత్రి కేటీఆర్ కారకులయ్యారు.
నేడు తెలంగాణలో జరుగుతున్న ఆధునిక అభివృద్ధి, సంక్షేమాల్లో యువ మంత్రి కేటీఆర్ పాత్ర ఎనలేనిది. రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో పండించిన పత్తిని కొనుగోలు చేసే అవకాశాన్ని మన రాష్ర్టానికి తీసుకువచ్చిన ఘనత కేటీఆర్దే. ‘కిటెక్స్’తో పాటు గ్లోస్టర్, వీదీ+కమోడిటీస్, కాళేశ్వరం ఆగ్రో, మలబార్ గోల్డ్ సంస్థలు 4037 కోట్ల పెట్టుబడులతో సుమారు 35 వేల ఉద్యోగాలను మూడురోజుల్లో రాష్ర్టానికి తెచ్చిన ఘనత కేటీఆర్ది. ఇలా 2014 నుంచి ప్రభుత్వం అన్నిరంగాల్లో అద్భుత ఘటనలను ఆవిష్కరిస్తున్నది.
ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కుదేలైపోతున్నప్పటికీ అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల వెల్లువతో ఆర్థికాభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. దీనికి కారణం రాష్ట్రంలో కేటీఆర్ లాంటి యువ నాయకత్వం ఉండటమే. ఆర్థికాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా తెలంగాణ అత్యంత డైనమిక్ రాష్ట్రంగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద టెక్, ఈ-కామర్స్ దిగ్గజాలను ఆకర్షిస్తున్నది. దీనికితోడు మన రాష్ట్రం అమలుచేస్తున్న ఆకర్షణీయ విధానాలు, ఇక్కడి అనుకూల వాతావరణం రాష్ర్టాన్ని పెట్టుబడులకు చిరునామాగా మారుస్తున్నాయి. అందుకే ఐకియా, అమెజాన్, బోయింగ్ , ఫేస్బుక్, ఐటీసీ, కోకా కోల, మైక్రాన్, గూగుల్, యాపిల్, టెక్ మహీంద్రా, సైయెంట్ లాంటి దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి వ్యాపార కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి.
తెలంగాణను సాంకేతికశక్తి కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న కృషిని చూసి, దావోస్లో 2022లో జరిగే తమ వార్షిక సమావేశానికి హాజరు కావాలని డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ఆహ్వానించడం గమనార్హం. ఇది ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ర్టానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్కు నిదర్శనం. తెలంగాణ తరపున కేటీఆర్ ఇప్పటికే వరుసగా మూడుసార్లు దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలకు హాజరయ్యారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం విదేశీ పెట్టుబడులను గణనీయంగా ఆకర్షిస్తున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటీఆర్ విజన్తో చేసిన సంస్కరణలు నేటి విజయాలకు కారణాలు. నవ యువ నాయకుడు, విద్యాధికుడు, మంచి వక్త అయిన కేటీఆర్ వల్లనే నేడు మనం పెట్టుబడులను, ఐటీరంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ను సాధించాం. తెలంగాణను ప్రపంచం ముందు ఆవిష్కరించే నాయకుడు కల్వకుంట్ల తారకరామరావు అనేది కాదనలేని సత్యం.
దేశంలో, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణను ఉత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడానికి అవసరమైన అన్నిచర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నది. ‘మీట్ ఆర్ బీట్’ పాలసీ ప్రభుత్వం తీసుకున్న మంచి ప్రయోజనకర చర్యల్లో ఒకటి. ఈ పాలసీలో భాగంగా, పరిశ్రమల కోసం ప్రపంచంలో ఎక్కడాలేని అవకాశాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దరఖాస్తుల త్వరిత ప్రాసెసింగ్ కోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు ఆమోదం, స్వీయ ధృవీకరణ విధానాన్ని అమలుచేసింది. స్వీయ ధృవీకరణ అనేది పరిశ్రమల స్థాపనకు అవసరమైన వివిధ అనుమతుల కోసం ఏర్పాటుచేసిన సింగిల్ విండో విధానం. దీనిప్రకారం.. ఏదైనా కంపెనీ ప్రారంభం కోసం గరిష్టంగా 15 రోజుల్లో అన్ని ఆమోదాలకు హామీ లభిస్తుంది. అనుమతి కోసం దరఖాస్తు చేసిన తర్వాత, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఆమోదాలు ఇచ్చినట్లుగా పరిగణించబడుతుంది. ఆమోదాలు, అనుమతుల కోసం స్వీయ ధృవీకరణ ఆధారిత వ్యవస్థను అనుమతించే ఏకైక రాష్ట్రం తెలంగాణ.
కంపెనీ యజమాన్యాలు.. తమ వ్యాపారాలు, కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు ఉత్తర్వుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణ పెట్టుబడుల చట్టాలను వారు పాటిస్తామని స్వీయ ధృవీకరణ పత్రం ఇవ్వడం ద్వారా మొదటిరోజు నుంచే పరిశ్రమ స్థాపనకు వారికి అనుమతి ఉన్నట్లుగానే భావింపబడుతుంది.
వాణిజ్య, ఉత్పత్తి దశకు వెళ్లడానికి ముందు అనుమతులు అవసరం. దీనికోసం ప్రభుత్వం టీఎస్-ఐపాస్ అనే మొట్టమొదటి, విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన సింగిల్ విండో క్లియరెన్స్ను చట్టబద్ధం చేసింది. అంతే కాకుండా స్టార్టప్ విధానాన్ని ప్రారంభించి, దానిచుట్టూ సహాయక పర్యావరణ వ్యవస్థను సృష్టించిన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ ఏర్పడిన రెండేండ్లలో, ఐటీ మంత్రి ‘ఇన్నోవేషన్ పాలసీ’ని ప్రారంభించారు. ఇది స్టార్టప్లు- ప్రభుత్వం మధ్య అంతరాలను తగ్గించడానికి; స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ఒక సంపూర్ణ విధానాన్ని నిర్వచిస్తుంది. 3621 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో, ఇప్పటివరకు 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోని అత్యుత్తమ రాష్ర్టాల్లో ఒకటిగా ఉండటాన్ని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకున్నది.
తెలంగాణ రాష్ర్టానికి ఐటీ, పెట్టుబడుల రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ను సృష్టించిన తారకరామారావు, మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తే పెట్టుబడులు, ఐటీ రంగంలో మన దేశం తిరుగులేని శక్తిగా నిలుస్తుంది.
(వ్యాసకర్త: ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షుడు)
కాసర్ల నాగేందర్రెడ్డి