బ్యాంకింగ్ రంగాన్ని కొవిడ్ సంక్షోభం కుదేలు చేయబోతున్నది. రెండో దశలో చూపిన తీవ్ర ప్రభావంతో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇటీవల ‘ఎస్ అండ్ పీ’ గ్లోబల్ రేటింగ్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. వచ్చే ఏడాదిన్నర కాలంలో బ్యాంకుల స్థూల రుణాల మొత్తంలో రానిబాకీలు 12 శాతం వరకు ఉండే అవకాశం ఉన్నది.
కరోనా సంక్షోభం నుంచి పుంజుకోవడం కోసం పర్యాటక, సూక్ష్మరంగాలకు, కేంద్రం ఉద్దీపనలు ప్రకటించింది. అదేవిధంగా ‘ఎస్ఎంఈ’లకు కూడా రుణాల గ్యారంటీ సదుపాయాన్ని కల్పించింది. ఈ చర్యల వల్ల ఆయా రంగాలకు చెందిన సంస్థలకు జారీచేసిన రుణాలపై బ్యాంకులకు కొంతమేరకు ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ బ్యాంకులకు సమీప భవిష్యత్తులో కష్టాలు తప్పేట్లు లేవని బ్యాంకింగ్రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా పూర్తిగా తగ్గితేనే దేశంలో లాక్డౌన్లు ఉండవు. సెకండ్ వేవ్ నుంచి ఇక బయటపడ్డట్టే అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మూడో వేవ్ ముంచుకొస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు చివరలో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభించబోతున్నదని ఐసీఎంఆర్ తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్థికాభివృద్ధిపై స్థిరమైన అంచనా వేయలేని పరిస్థితి. కాకపోతే ఉత్పత్తి రంగానికి, ఎగుమతులకు కరోనా మొదటి దశతో పోల్చితే రెండోసారి తక్కువ నష్టం జరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. దేశం మొత్తమ్మీద ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు ఫర్వాలేదని అనుకుంటున్నప్పటికీ ప్రజల పొదుపుమొత్తాలు క్షీణించిన పరిస్థితుల్లో, వినియోగం తగ్గుముఖం పడుతున్నది. కొనుగోలుశక్తి ఆశించిన మేర లేకపోవడంతో ఆర్థికవ్యవస్థ కోలుకునే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు.
దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులు, భవిష్యత్పై భయం నీడలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22), నిజ స్థూల జాతీయోత్పత్తి (రియల్ జీడీపీ) వృద్ధి రేటు 9.5 కంటే ఉండకపోవచ్చని ఆర్థికవేత్తల అంచనా. ఈ ఏడాది ఏప్రిల్, మేలలో బ్యాం కులు అతి తక్కువ రుణాలు ఇచ్చాయి. దీనికితోడు రాని బాకీల ముప్పు ఉండనే ఉన్నది. ముఖ్యంగా పర్యాటక ప్రాజెక్టులు, వాణిజ్య రియల్ ఎస్టేట్, సెక్యూరిటీ లేని రిటైల్ రుణాలు రాని బాకీలుగా మారిపోయే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సూక్ష్మ రుణసంస్థలు, ఎస్ఎంఈ రంగాలకు కేంద్రం ప్రకటించిన రుణమద్దతు చర్యల వల్ల కొంతమేరకు బ్యాంకులు జారీచేసిన రుణాలపై ఒత్తిడి తగ్గుతుందని, అయినా ప్రస్తుత పరిస్థితుల్లో రుణాల వసూలు అంత సులువైన వ్యవహారం కాదని బ్యాంకింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొవిడ్-19 రెండో దశతో ఆతిథ్యరంగానికి పెనునష్టం జరిగింది. కొవిడ్ తొలి దశ నుంచి కోలుకునే దిశగా ముందుకుసాగుతున్న ఆతిథ్య రంగం దీనివల్ల మళ్లీ కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుత ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికంలో వ్యాపార కార్యకలాపాలు సాగలేదు. ఈ ప్రభావం ఆతిథ్యరంగాన్ని అతలాకుతలం చేసింది. ఈ ప్రభావం నుంచి కోలుకోవడం ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు. కేంద్రం నిర్లక్ష్య వైఖరితోనే కరోనా రెండో దశ ప్రభావం తీవ్రమైందని ప్రముఖ మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ తీవ్ర విమర్శలు చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగంలోని సంస్థలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఎదురుకానున్నది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు ఇబ్బందికర పరిస్థితి తప్పేలా లేదు. వచ్చే ఏడాదిన్నర కాలంలో మొండి బకాయిలు బ్యాంకులను తీవ్రంగా ఇబ్బంది పెట్టనున్నాయి. ఇప్పటికే థర్డ్ వేవ్ ఎనభై దేశాల్లో మొదలైందని ప్రపంచ ఆరోగ్య సం స్థ ప్రకటించింది. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ఆర్థికవ్యవస్థ మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయే ప్ర మాదం ఉన్నది. ఇది బ్యాం కుల రుణ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.
శ్రీనివాస్గౌడ్ ముద్దం