సామాన్య ప్రజానీకానికి అనువుగా దేశీ, గ్రామ్య భాషలకు ప్రాధాన్యమివ్వడం శాతవాహన చక్రవర్తుల కాలంలో మరింత స్థిరపడింది. తెలుగు ప్రాంతాన్నే కాక, దక్షిణా పథంలో అధిక భాగాన్ని దాదాపు 450 సంవత్సరాల పాటు మొత్తం 30 మంది శాతవాహన రాజులు పాలించారు. ఈ వంశ స్థాపకుడైన సిముకుడి కాలం నుంచి వీరి అధికార భాషగా ప్రజల భాష అయిన ప్రాకృతం విలసిల్లింది. కోటి లింగాల రాజధానిగా మొదలై, ఆ తర్వాత ప్రతిష్టానపురం (పైఠాన్), ధరణి కోట (ధాన్యకటకం)కు మారి సామ్రాజ్యాన్ని విస్తరించిన శాతవాహనుల అధికార భాషగా కుంతల శాతకర్ణి కాలం వరకూ ప్రాకృతమే చలామణి అయింది. అందుకే ఈ కాలంలో సాహిత్యం, భాష మాత్రమే కాక శాసనాలు కూడా చాలా వరకు ప్రాకృత భాషలోనే లిఖించబడ్డాయి.
శాతవాహనుల కాలంలో దేశి గ్రామ్య సంప్రదాయానికి చెందిన ప్రాకృత భాష లో రచించిన సాహిత్యంలో పేరెన్నిక గన్న రచన శాతవాహన 17వ చక్రవర్తి హాలుడు రాసిన ‘గాథాసప్తశతి’ని చెప్పవచ్చు! 700 కథల గుచ్ఛంగా తెలుగు సాహితీ చరిత్రలో సంకలన సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఈ కావ్యంలో వందలాది తెలుగు పదాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. వాటిలో పొట్ట, అత్త, బొంది, రంప, పిల్ల, అద్దం, పాడి, మైల, కుసురు వంటివి కొన్ని ఉదాహరణలు.
కాగా తెలంగాణ భాష దేశి-గ్రామ్య సంప్రదాయానికి పట్టుగొమ్మగా నిలిచింది. 14వ శతాబ్దంలో పాల్కురికి సోమన చేసిన రచనలే దీనికి ఉదాహరణ. అచ్చ తెనుగు, జాను తెనుగు అనే పేరుతో దేశి-గ్రామ్య భాషా సంప్రదాయానికి సాహితీ ప్రతిపత్తిని, ప్రజాభాషకు కావ్య గౌరవాన్ని అందించే ప్రయత్నాన్ని పాల్కురికి తన వృషాధిప శతకం’, బసవోదాహరణం’ ఇతర కావ్యాలలో చేశారు. ఆఖరికి సంస్కృత భాషా ప్రభావితుడైన పోతన కూడా తన భాగవత అనువాదంలో అత్యధికంగా దేశి-గ్రామ్య భాషా సంప్రదాయాన్ని అనుసరించి తెలుగులోకి అనువాదం చేశాడు.
ఈ విధంగా మొదటినుంచి తెలుగు భాషలో మార్గ, దేశీ రెండు పాయలు సమాంతరంగా కొనసాగడమే కాకుండా వేర్వేరు మాధ్యమాల ద్వారా (గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు వంటి లిఖిత మాధ్యమాల ద్వారా అయితే, దేశి సంప్రదాయం – ప్రజల నాలుకల మీద మౌఖిక, ఆశు రీతులలో ఎక్కువగా, గ్రంథ రీతులలో కొంతవరకు ) ఒక తరం నుంచి మరో తరానికి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ తెలుగు భాషను రెండు విధాలుగా సుసంపన్నం చేస్తూ వచ్చాయి. కుతుబ్ షాహీల పాలనాకాలంలో అద్దంకి గంగాధరకవి (తపతీ సంవారణోపాఖ్యానం), పొన్నెగంటి తెలగన్న (యయాతి చరిత్ర), కందుకూరి రుద్రకవి (సుగ్రీవ విజయ ం, నిరంకుశోపాఖ్యానం), సింగరాచార్య (దశరధ నందన చరిత్ర), కృష్ణమాత్యులు (రాజనీతి రత్నాకరం), సారంగ తమ్మయ (వైజయంతీ విలాసం), కంచర్ల గోపన్న రామదాసు (దాశరథి శతకం, కీర్తనలు)లు తెలుగు భాషా సాహిత్యాలకు గ్రంథ రూపంలో శాశ్వతత్వాన్ని అందించారు.
ఆ తర్వాత తెలంగాణను దాదాపు 224 ఏండ్లు (1724-1948) పరిపాలించిన ఆసఫ్ జాహీ నిజాం రాజుల కాలంలో పారశీకం, ఉర్దూ, తెలుగు భాషల మధ్య ఆదాన ప్రదానాలు ఎన్నో జరిగాయి. నిజాం ఉల్ ముల్క్ (1724-48), నాసిర్ జంగ్ (1748-50), ముజఫర్ జంగ్ (1750-51), సలాబత్ జంగ్ (1751-61), నిజాం అలీఖాన్ (1761 -1803), సికిందర్ జా (1803-1829) , నాసిర్ ఉద్దౌలా (1829-57), అఫ్జల్ ఉద్దౌలా (1857-69), మీర్ మహబూబ్ ఆలీఖాన్ (1869-1911), మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ (1911-1948) వంటి నిజాం రాజులు రాజభాష ఉర్దూ తో పాటు తెలుగుకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. ప్రజలు కూడా అస్తిత్వ ప్రతినిధిగా తెలంగాణ భాష వాడుకలో, నిత్య వ్యవహారంలోనేకాక, లిఖిత రచనలు, సాహిత్య రూపాలలో కూడా సుస్థిరం చేసుకున్నారు.
ఇలా ముస్లిం పరిపాలకుల ప్రభావం వల్ల పర్షియన్ భాష, ఉర్దూ భాషలు పరిచయమై తెలుగులో ఎన్నో అన్య దేశ్యాలు, ఇతర భాషా పదాలు, ఇతర భాషల నిర్మాణ శైలి తెలుగు భాషలోకి వచ్చాయి. అలాగే తెలుగులోని పదాలు నిర్మాణ శైలులు ఇతర భాషల్లోకి అంతరీకరణం చెందాయి. దీన్ని బట్టి తెలంగాణా భాష ప్రాక్ చరిత్ర కాలంలో గిరిజన ఆదివాసీ భాషలచేత, ప్రాచీన కాలంలో మొదట ప్రాకృత భాష, ఆ తర్వాత సంస్కృత భాష చేత, మధ్యయుగ కాలంలో అరబిక్, పర్షియన్, ఉర్దూ భాషల చేత, ఆధునిక కాలంలో ఇంగ్లీష్ భాష చేత ప్రభావితమై ఇతర ప్రాంతాల తెలుగు భాషకన్నా ప్రత్యేకతను, విశిష్టతను సంతరించుకున్నది.
ఉపరితలం నుంచి గమనిస్తే తెలంగాణ భాష అంతా ఒకేలా కనిపించినప్పటికీ, జిల్లాలు, ప్రాంతాల వారీగా కూడా పదాలు, ఉచ్ఛారణ, వాక్య నిర్మాణ పరంగా విభిన్నత, వైవిధ్యత (Differe nce and Diversity) కనిపిస్తాయి. భాషా పరిణామంలో ఈ భావనను ఉప మాండలికాలు (Sub-dialects) గా అభివర్ణించవచ్చు.
If we closely and deeply observe the evolution and expansion of the langua ge, it will be revealed that, there is a possibility of sub-dialects also, unlike the previously established norms of the exis tence of main stream language and dialects. The ‘Sub-dialects’ are ju st like ‘sub-cultures’ originate from the needs and lifestyle of the sub-regions, the occupations, entertain ment and enterprises in which the people engaged themselves. This phenomenon of ‘sub-dialects’ can be distinctly seen in the words and language style used in the districts of Telangana,which enriches and differentiates one place the other.
ఇలా తెలంగాణ భాష ఉప-మాండలికాల కోణం లోనూ విస్తృతమైన అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకతను సృష్టిస్తున్నది. అంటే భౌగోళికంగా ప్రాంతాలవారీగా, ఆర్థిక నేపథ్యంలో వృత్తుల వారీగా కూడా అధ్యయనం చేయవలసి ఉన్నది. అలాగే విస్తృత సామాజిక, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యంలో నుంచి తెలంగాణ భాష, సాహిత్యాల స్థితిగతులను పరిశీలించడం అవసరం. ఇవన్నీ జరిగినపుడు మాత్రమే ద్రవిడ భాషా కుటుంబంలో తెలంగాణ భాషా విశేషాలు, ప్రత్యేకత, వైవిధ్యత, ఎలాంటిదో, ఎంత విశిష్టమైనవో అర్థమవుతుంది. అప్పుడే తెలుగు భాష తేనెకన్నా తీయనిది’ అనీ, మట్టిలాంటి సహజమైన భాష తెలంగాణ భాష’ అనే మాటలు మరింత అర్ధవంతం అవుతాయి.
-డాక్టర్ మామిడి హరికృష్ణ ,80080 05231