సిటీబ్యూరో, మే 5(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా (యూటీ) చేసి నగరాన్ని లూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని, దీనిని అడ్డుకోవాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి, పద్మారావుగౌడ్కు మద్దతుగా ఆదివారం ఎల్బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. ఎల్బీనగర్లోని కర్మన్ఘాట్, ఉప్పల్క్రాస్రోడ్, ముషీరాబాద్ రాంనగర్ క్రాస్రోడ్లో జరిగిన కార్నర్ మీటింగ్లలో కేటీఆర్ ప్రసంగించారు.
2014లో మోదీ ఎన్నెన్నో మాటలు చెప్పారని, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ. 15 లక్షల నగదు, రైతుల ఆదాయం రెట్టింపు, దేశంలో బుల్లెట్ ట్రైన్లు పరుగెత్తిస్తా, ప్రతి ఇంటికి నల్లా, ఇండ్లు లేన్నోళ్లకు ఇండ్లు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారని మండిపడ్డారు. నమో అంటే..నమ్మించి మోసం చేయడమని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్కు వరదలు వస్తే ఒక్క పైసా ఇవ్వలేదని, గుజరాత్కు వరదలు వస్తే మాత్రం రూ. వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. పప్పు, ఉప్పు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని, ప్రధాని మోదీని ప్రజలు పిరమైన ప్రధాని అంటున్నారని పేర్కొన్నారు.
బీజేపీకి ఓటు ఎందుకు వేయాలంటే.. మేం గుడికట్టినం ఓటు వేయాలె అంటున్నారని, ఒక్క గుడి కట్టడమే ప్రామాణికమైతే.. అద్భుతంగా కేసీఆర్ యాదాద్రిని కట్టారని, దీంతో పాటు కాళేశ్వరం వంటి ఆధునిక దేవాలయమైన ప్రాజెక్టులు కట్టారని చెప్పారు. దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం ఏమిటని.. దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేశారో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పదేండ్లలో గ్రేటర్లో ఎస్ఆర్డీపీ ద్వారా 36 ప్రాజెక్టులు కట్టామని, కేంద్రంలోని బీజేపీ సర్కారు నారపల్లి, అంబర్పేట ఫ్లై ఓవర్లు కట్టలేకపోయిందన్నారు. ఇదే మోదీ ప్రభుత్వానికి, కేసీఆర్ సర్కారుకు ఉన్న తేడా అని కేటీఆర్ అన్నారు.
1.8 శాతం తేడాతో కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చిందని, బీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ నిర్మల్ సభలో పచ్చి అబద్ధాలు చెప్పారని, ప్రతి మహిళా ఖాతాలో నెలకు రూ. 2500లు, పింఛన్ రూ.4వేలు ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనవరి నుంచి ఒక్కో మహిళకు రూ.10వేలు, పింఛన్దారులకు రూ. 16వేలు, ఆడబిడ్డలకు లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నారని పేర్కొన్నారు.
రాహుల్గాంధీ అమాయకుడని..ఇక్కడి కాంగ్రెస్ నేతలు రాసిచ్చింది చదివారని, అసలు రేవంత్రెడ్డి ఎన్నికలు అయ్యాక కాంగ్రెస్లో ఉంటారో లేదో చూసుకోవాలన్నారు. రాహుల్గాంధీ చౌకీదార్ చోర్ అంటే..రేవంత్రెడ్డి మోదీ బడే బాయ్ అంటున్నారని, గుజరాత్ మోడల్ ఫేక్ అని ఆయన అంటే ..రేవంత్రెడ్డి మాత్రం గుజరాత్ మోడల్ తెస్తానంటున్నారని చెప్పారు. రాహుల్ అదానీ ఫ్రాడ్ అంటే.. రేవంత్రెడ్డి అదానీ మేరా ఫ్రెండ్ అంటున్నారని, అదానీకి సింగరేణి, ఇతర సంస్థలు కట్టబెట్టేందుకు రేవంత్రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
‘సీఎం హోదాలో రేవంత్రెడ్డికి హుందాతనం ఉండాలె.. కానీ చిల్లర మాటలు, ఉద్దెర పనులు చేస్తున్నారు’..అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఐదు నెలల పాలన చూసిన గ్రామీణ ప్రాంత ప్రజలు పొరపాటు చేశామంటున్నారన్నారు. గతంలో ఐదు సీట్లతో తెలంగాణను ఎట్ల సాధించామో..అట్ల 10-12 సీట్లు ఇస్తే ఏడాదిలోగా మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎండాకాలం వచ్చినా..రెప్పపాటు కరెంట్ పోలేదని, నీటి గోస లేదని కేటీఆర్ వివరించారు. కృష్ణా, గోదావరి నీళ్లను తీసుకొచ్చి మెరుగైన నీటి సరఫరా చేయలేని.. చేతకానీ దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు 24 సీట్లలో ఒక్కటి కూడా కాంగ్రెస్కు ఇవ్వలేదని, 16 సీట్లను బీఆర్ఎస్కు ఇచ్చి పట్టం కట్టారని, హైదరాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంటులో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పొలిటికల్ టూరిస్టులేనని, స్థానికుడు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.