జీవితాలను కథలుగా వ్యాఖ్యానించడమంటే మరుగునపడిన మానవ సంబంధాల ఎతలను దృశ్యీకరించడమే.
నిజ జీవితంలో కనబడని కోణాలను, మనసు తడిని, ప్రేమ పదనును అక్షరాల్లో, అంతరాత్మను కథల్లో
ఆవిష్కరించడమే కథనం. నిబద్ధతతో, నిజాయితీగా మానవీయతను నిలుపడమే కథల అంతిమ లక్ష్యం. బంధాలను అక్షరీకరించడం ద్వారా సంఘటనలకు జీవం పోసే అక్షర శిల్పి, కథకులు కొట్టం రామకృష్ణారెడ్డి. ఆయన కథలు జీవితాల్లోని అడుగంటిన ప్రేమను పాతాళగరిగెతో దేవి గిడసబారిన మనసుపై కుంభవృష్టిగా ఆర్ద్రతలను కురిపిస్తాయి.
మమతలను బాధ్యతగా హృదయంలోకి ఒంపి అనుబంధాలను తిరిగి అంకురింపజేస్తాయి. కథల్లోని పాత్రలు నిజ జీవితంలో నిగ్గదీసి, నిలదీసి అడుగుతున్నట్టు కనిపిస్తాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను ప్రకటించిన ఉత్తమ కథానిక పురస్కారానికి ‘నూనె సుక్క’ ఎంపికవడం విశేషం.
ఆధునిక జీవితంలో నూతన దంపతుల మధ్య అగాథం సృష్టిస్తున్న అనుమానం పెనుభూతమై పచ్చని సంసారంలో దాంపత్య జీవితానికి మంట పెడుతున్న సంఘటనలు అనేకం కనిపిస్తుంటాయి. మనసెరిగి మసలుకుంటే జీవితం ఎలా మారుతుందో నిరక్షరాస్యుల విచక్షణాత్మక నిర్ణయాన్ని ఆదర్శంగా చూపుతూ రాసిన కథ ‘అద్దం వెనుక’.
అర్థం వేరు, అంతరార్థం వేరు. వాస్తవాన్ని గుర్తించకపోతే అపార్థమే జనిస్తుంది. ప్రాణానికి ప్రాణంగా ఉన్న తల్లికొడుకుల మధ్య ఒకరి మొఖం ఒకరు చూడకుండా, ప్రేమ లేకుండా చేసిన ‘నూనె సుక్క’ తల్లి కొడుకులను ఎందుకు విడదీసింది? కనపడని శూన్యాన్ని ఎలా నింపిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. రచయితకు నానమ్మ చెప్పిన జీవిత తాత్త్వికత, మార్మికతలో జీవితానికి సరిపడా ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆలోచనలో బాధపడినదెవరో ‘నూనె సుక్క’ కథ చదివి అపార్థాన్ని తొలగించుకోవాల్సిందే.
కథలోని పాత్రోచిత సంభాషణ, సమన్వయంతో పాటు సొగసైన వర్ణనతో రచయిత ఆకట్టుకుంటాడు. పోలికల ద్వారా కథనానికి రచయిత బలం చేకూరుస్తాడు. ‘నా ఎన్నెల ఎలుగుల కన్న ఎక్వ వెలుగు యాడ్కెల్లొచ్చింది’ అని సీత కండ్లని సూసి సిగ్గుపడి మబ్బు సాటుకు దాక్కున్న సంద్రుడని వ్యక్తీకరించడం ద్వారా ఆఖరికి కథలో అతిశయాన్ని అతికిస్తాడు. ‘సూర్యుడు ఊరిడ్శిపెట్టి పోయిండు, పొద్దుగాల మల్లొస్తనని జెప్పి’ అని ‘తాతిల్’ కథలో పోలుస్తాడు. ‘పెండ్లి పిల్ల కడిగిన ముత్యమోలే మంచిగున్నది’, ‘ఎవరి బతుకు వారే బతుకాలని పెద్దగయినంక కోడి తన పిల్లలను ఎడవాపుతుంది’ లాంటి పోలికలు కావల్సినన్ని ఏరుకోవచ్చు. ఇలా.. ప్రతి కథలోనూ ఒక సామాజిక దృక్పథం ఉండటం రచయిత సామాజిక బాధ్యతకు నిదర్శనం. మనుషులంతా మానవీయ సంబంధాలతో అనుబంధాలు పెనవేసుకొని జీవించాలని, లుప్తమవుతున్న విలువలను పెంపొందించాలని సందేశం ఇచ్చేవి ‘నూనె సుక్క’ కథలు.
ఆర్ద్రతను పిండి మనసును తడిచేసే కథలివి. ఎంచుకునే కథా వస్తువును లోతుగా పరిశీలించి, పరిశోధించి ఫలవంతంగా అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని సృష్టించడం కొట్టం రామకృష్ణారెడ్డి ప్రత్యేకత. ఆయన శిల్పంలో మట్టి కూడా మాణిక్యంగా మారుతుందనడంలో అతిశయోక్తి కాదేమో. కథకు కథకు పోలిక లేకుండా, ఊహకు అందకుండా రాసే ఆయన శైలి ఎంతో రమణీయం. ఇవి టైంపాస్ కథలు కావు, తప్పక చదువాల్సిన బతుకు గాథ లు. బాధ్యతలకు బాటలేసి అత్యుత్తమ మా‘నవ’ జీవితాన్ని ప్రబోధించే ఆచరణాత్మక ఎతలు.
డాక్టర్ , సిద్దెంకి యాదగిరి
94412 44773