మొన్నటి ఐతారం కన్నారం నుంచి తమ్ముడు రాజు ఫోన్జేసి ‘అన్నా ఏడున్నవే..’ అంటే ‘నేను పట్నంలనే ఉన్న తమ్మీ’ అన్జెప్పిన. ‘ఏందన్నా.. ఈ కరోనా పాడుగాను అందర్నాగం జేయవట్టె?’, ‘ఏమైంది తమ్మీ, మళ్లెవ్వళ్లకు వచ్చింది పాజిటివ్?’, ‘చెప్తె వినలె, కరోనా ఎక్కువైతుంది ఇప్పుడేం పోతర్తియ్ అంటే ఇనకుండా పోయిర్రె తిరుపతికి, ఇళ్లు మొత్తం పాజిటివే, మామకు వయస్సు మీద వడ్డది కదా, నాకేం సమజయితలే’, ‘ఏ కరోనానే కదా తమ్మీ, అదే పోతది తీయి భయపడొద్దు’, ‘ఏ ఎక్కడిదన్న, తతీమ ముగ్గురు మంచిగనే ఉన్నరు గనీ మామకే మొసెల్తలేదంటే కన్నారం ప్రైవేటు దవాఖాన్ల షరీఖ్ జేసిన’, ‘మన కన్నారం ప్రైవేట్ దవాఖాన్ల గురించి తెలుసు కదా తమ్మీ, సర్కార్ దవాఖాన్ల షరీఖ్ చేస్తే అయిపోతుండె కదా?’, ‘బుద్ధి తక్కువై ప్రైవేట్ల షరీఖ్ చేసుడైందన్న, 2 లక్షల రూపాల ప్యాకేజీ అంట, మొదాలు మొత్తం వాళ్లే చూస్కుంటమన్నరు, పొద్దున లేస్తే ఫోన్జేసి, ట్యాబ్లెట్లు తీస్కరావాలె, పేషంట్ దగ్గర ఎవ్వలున్నరని ఇప్పుడడుగుతుర్రు’, ‘హవ్వ.. 2 లక్షలా? గంతగనం ఎందుకు తమ్మీ?’, ‘ఏమో అన్న వాళ్లీల్లతో చెప్పిస్తే నలభై వేలు తగ్గించిర్రన్నా..’
మొన్నటి సోమారం ఒక్కటే మొకాన మోగుతున్నది ఫోన్. ఎవరా? అని చూస్తే చిన్నప్పటి దోస్తు
మల్లికార్జున్ గాడు. వరుసకు మామయితడు. ఫోనెత్తి ‘మామ చెప్పు’ అన్న.., ‘నాకు మొన్న పాజిటివ్ వచ్చింది మామ, నాకొక్కనికే కాదు, ఇంట్లో ఉన్న ఐదుగురికీ పాజిటీవే..’, ‘ఏ మామ, అస్తది, పోతది తీయి భయపడద్దు, ఏం కాదు’, అన్జెప్పిన.
మంగళారం పగటీలి సిటీ బస్సుల ఆఫీసుకు పోతున్న, మల్లికార్జున్ మామ నుంచి ఫోన్. మామ పానం ఎట్లుందోనని ఫోనెత్తి ‘హలో మామ..’ అవుతలి వైపు నుంచి ఉత్త మొసనే ఇనవడ్తంది. నేను మళ్లోసారి ‘హలో మామ.. హలో మామ..’ పది సెకన్ల తర్వాత.. ‘మామ అరేయ్ సర్కార్ దవాఖాన్ల షరీఖైన’, ‘అగ్గో దవాఖానకు ఎందుకు పోయినవ్ మామ’, ‘మామ శ్వాస ఇబ్బందైంది, శాచురేషన్ చెక్ చేస్తే ఎనభై ఒక్కటే వస్తున్నది మామ, ఏమన్నయితదా?’ మామూలు టైంలో గంట మాట్లాడినా ఇబ్బందిలేకుండా మాట్లాడేటోడు, మూడు ముచ్చట్లు మాట్లాడుతనే మొస ఎగ పోసుకుంటా అస్తున్నది. ‘మామ ఏం గాదు, నువ్వు భయపడకు, నేను డాక్టర్లతో మాట్లాడుతలె’ అని ధైర్యం చెప్పి, ఎంబటే తెలిసిన గవర్నమెంట్ డాక్టరుంటే ఫోన్ కలిపిన. ‘ఏమీ కాదు, భయపడకుమని చెప్పండి, వాళ్లే ఆక్సిజన్ పెడతారు, అవసరం అనుకుంటే రోజుకు మూడు నాలుగు ఇంజెక్షన్లు ఇవ్వవచ్చు. రెండు రోజులలో మంచిగ కావచ్చు’ అని డాక్టర్ నిదానంగా చెప్పిండు.. ‘మామ, ఇప్పుడే డాక్టర్తోని మాట్లాడిన ఏం గాదన్నడు, ముందుగాళ్ల నిన్నయితే భయపడకుమని చెప్పిండు..’, ‘ఏ భయపడ్తలేను మామ..’
మంగళారం మాపటీలి నేను మల్లికార్జున్ మామకు ఫోన్ కల్పిన. ‘మామ ఎట్లుందే పానం?’, ‘మంచిగనే ఉన్నది మామ, ఇప్పుడు కొంచెం ధైర్నం వచ్చింది’ మాట మామూలుగనే ఉన్న ది. నాక్కూ డా కొంచెం ధైర్నం వచ్చింది. ‘ఇప్పుడు శాచురేషన్ 93, 94 సూపెడ్తున్నది మామ, రోజు పొద్దున మూడు, పొద్దూకి రెండు సూదులిస్తున్నరు. సర్కార్ దవాఖాన డాక్టర్లు ్ల, నర్సులు మంచిగ సూసుకుంటున్నరు. సర్కారు దవాఖానకు చేతులెత్తి మొక్కాలి మామ’.
పై రెండు ముచ్చట్లు మా కన్నారంల జరిగినయే. ఒక్కటి ప్రైవేట్ దవాఖాన్ల అయితే, ఇంకోటి సర్కార్ దవాఖాన. అసలు కరోనా రోగానికి మందే లేదు, అసొంటప్పుడు లక్షల కొద్దీ బిల్లు ఎట్లా ఏస్తరు? కన్నారంల ఉన్న ప్రైవేట్ దవాఖాన్లు బిజినెస్కు అడ్డా అనే పేరు ఎన్కటే అచ్చింది. ఇప్పుడు మళ్లోసారి రుజువైంది. ‘సారూ.. నాకు కరోనా రోగం అచ్చిందటా జర నన్ను కాపాడ’ంటూ కాళ్ల మీద పడ్తున్నరు రోగులు, వాళ్ల సంబందీకులు. వాళ్లను కాపాడాల్సింది పోయి, సచ్చినోని పెండ్లికి అచ్చిందే కట్నం అన్నట్టు ప్యాకేజీల పేరుతో బేరమాడుకుంటున్నరు. ఒక్క కన్నారంలనే కాదు, రాష్ట్రంల ఏడజూసినా ప్రైవేట్ దవాఖాన్ల పరిస్థితి ఇట్లనే పాడైంది. నాకు డిగ్రీల సదువు చెప్పిన సారుకు మొన్న కరోనా రోగమొచ్చి పట్నంలోని ఓ ప్రైవేట్ దవాఖాన్ల షరీఖయితే 12 లక్షల బిల్లు అయిందట!
ఈ ప్రైవేటు దవాఖాన ఓనర్లలో అసలు మానవత్వం ఉందా? ఉంటే మందే లేని కరోనా రోగానికి 12 లక్షలు ఎట్లయితయి? కన్నారంల రెండు లక్షల బిల్లు చెప్పినోడు ఒక్కటే మొకాన 40 వేలు ఎట్లా తగ్గిస్తడు? సరే పైసలున్నోళ్లు ప్రైవేట్ దవాఖాన్లకు వోతుర్రనుకుందాం, నా అసొంటి పేదోనికి కరోనా రోగమొస్తే ఎట్లా గతి?
ఈ ప్రైవేట్ దవాఖాన్లు లక్షలకు లక్షల ఫీజులు తీసుకొని కరో నా రోగాన్ని తగ్గిస్తున్నయా అంటే అదీ లేదు. జీవునం కొనూపిరి మీదున్నప్పుడు ‘మాతోని ఐతలేదు, గాంధీకి పట్కపోర్ర’ని బిల్లు కట్టించుకుంటున్నరు. కొనూపిరి మీదున్న జీవునాలు రోజుకు వందల సంఖ్యలో గాంధీకి చేరుతున్నయి. పాపం గాం ధీ దవాఖాన ఎన్ని జీవునాలొచ్చినా అక్కున చేర్చుకుంటున్నది. పాణం మీదికొచ్చినంక గాంధీల షరీఖై, ఆ రోగి సచ్చిపోతే.. నరం లేని నాలుకలు కదా, గాంధీ దవాఖాన్ల రోజుకు వందల మంది సచ్చిపోతుర్రని దీర్ఘాల్దీస్తున్నయి. కరోనా రోగాన్ని గుర్తిం చి గాంధీల ముందుగాళ్లనే షరీఖై, ఆ రోగం తగ్గిపోయి ఇండ్లళ్లకు పోతున్నవాళ్లెందరో ఉన్నరు. మొన్నొక్కరోజే 316 మంది కరో నా తగ్గిపోయి తమ ఇండ్లళ్లకు చేరుకున్నరు. మంచిర్యాలకు చెం దిన ఓ ఆడిమనిషి కరోనా తగ్గి ఇంటికివోంగ గాంధీ దవాఖానకు చేతులెత్తి ఎట్ల మొక్కిందో చూసినం.
రాష్ట్రంల ఉన్న ప్రభుత్వ దవాఖాన్లు మంచిగున్నయని చెప్పడానికి మంచిర్యాల ఆడిమనిషి, నా చిన్నప్పటి దోస్తు మల్లికార్జున్ గాడు చెప్పిన ముచ్చట్లే సాక్షం. కరోనా రాంగనే భయపడొద్దు. ఇప్పుడన్ని సర్కార్ దవాఖాన్లల్ల కరోనా టెస్టులు చేస్తున్నరు. ఏ మాత్రం అనుమానాలున్నా టెస్టులు చేయించుకోర్రి, కరోనా ఉన్నదని తెలిస్తే సర్కార్ డాక్టర్లే మందులిచ్చి ఇంటికి తోల్తున్నరు, మజ్జమజ్జన ఫోన్లు చేసి కూడా మంచి చెడ్డలర్సుకుంటున్నరు. కావట్టి కరోనాను ఇంట్లనే ఉండి మంట్లె కలుపుదాం. ఏమన్న పాత రోగాలుంటె మాత్రం కరోనాను అశ్రద్ధ చేయకుండా సర్కార్ దవాఖాన్ల షరీఖ్ గావాలె. అంతేకానీ సర్కార్ దవాఖాన్లు మంచిగ లెవ్వని ఎవ్వలో చెప్తే, ప్రైవేట్ దవాఖానల షరీఖై అప్పుల పాలు కావద్దు. సర్కార్ దవాఖాన్లళ్ల అన్నిరకాల సౌలతులన్నయి.
ఆఖరి ముచ్చట.. కరోనా పేషంట్లకు నీడనిస్తున్న సర్కార్ దవాఖాన్లకు, కరోనా రోగులను సూత్తె కసురుకోకుండా ప్రేమతోని సూస్కుంటున్న సర్కార్ డాక్టర్లకు, నర్సులకు, స్వీపర్లకు శతకోటి శనార్థులు.
-గడ్డం సతీష్
ఇవీ కూడా చదవండీ…