Director Malli Ankam | ‘పెళ్లి చుట్టూ ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి? ఆ ఎమోషన్స్ని కొందరు ఎలా క్యాష్ చేసుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు వినోదాత్మక సమాధానం మా ‘ఆ ఒక్కటీ అడక్కు’. అందరూ కనెక్టయ్యే కంటెంట్ ఇది’ అంటున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. రాజీవ్ చిలక నిర్మాత. మే 3న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు మల్లి విలేకరులతో ముచ్చటించారు. ‘పెళ్లి గురించి అందరూ తేలిగ్గా అడిగేస్తారు. కానీ తీసుకునే వాళ్లు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. కుటుంబానికి కూడా అదో బాధ. ఆ ఉద్వేగాన్నే కామెడీతో చెప్పాం.
అలాగే పెళ్లి సంబంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సినిమాలో చూపించాం. పెళ్లి గురించి అడిగినప్పుడు హీరో చెప్పే సమాధానమే ‘ఆ ఒక్కటీ అడక్కు” అని తెలిపారు మల్లి. నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న నరేశ్, కామెడీ కథ అనేసరికి ముందు అంత ఉత్సాహం చూపించలేదని, అయితే కథ చెప్పడం మొదలుపెట్టాక, ఫస్టాఫ్ వినగానే ‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అనేసి షేక్ హ్యాండిచ్చారని, తను ఓకే చేసిన ప్రాజెక్టులను వెనక్కు నెట్టి మరీ ముందు ఈ సినిమా చేశారని, అంతలా ఈ కథ నరేశ్ని ఆకట్టుకుందని మల్లి చెప్పారు. ‘ఫరియా అందంతోపాటు కామెడీ టైమింగ్ ఉన్న నటి.
ఇందులో కథను మలుపుతిప్పే పాత్ర ఆమెది. అబ్బూరి రవిగారు మాటలు ఆకట్టుకునేలా ఉంటాయి. గోపీసుందర్ పాటలు అద్భుతంగా ఉంటాయి. ఈ కథకు కావాల్సిన బడ్జెట్ని సమకూర్చి, సినిమా బాగా రావడానికి కారకులు మా నిర్మాత రాజీవ్ చిలకగారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అన్నారు. మల్లి అంకం.