Inheritance Tax | ప్రజల వ్యక్తిగత సంపద హక్కుల విషయంలో జాతీయపార్టీలు రెండూ దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల తొలిదశ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారంలో ఈ పన్ను అంశాన్ని లేవనెత్తారు. సంపద, ఆదాయాల్లో పెరుగుతున్న అంతరాలను తగ్గిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని ఎత్తిచూపుతూ, కాంగ్రెస్ గెలిస్తే ఆడవాళ్ల మెడల్లో పుస్తెలు కూడా మిగలనివ్వరని, ముస్లింలకు పం చేస్తారని ఆరోపించారు.
మరోవైపు వారసత్వ పన్ను తనకు న్యాయంగానే కనిపిస్తుందని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా సమర్థించారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ను బోనులో నిలబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నప్పటికీ వేరే సందర్భాలలో బీజేపీ కూడా ఈ పన్నుకు అనుకూలంగా మాట్లాడింది. 2014లో ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, 2018లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీలు కూడా వారసత్వ పన్నును సమర్థించారు.
ఒక వ్యక్తి వీలునామా రాసి లేదా రాయకుండానే మరణించినప్పుడు సదరు వ్యక్తి ఆస్తులను వారసులు పంచుకోవడం సహజంగా జరిగేదే. అమెరికా తదితర దేశాలు ఈ తరహా ఆస్తి పంపకాల పై వారసత్వ పన్నును విధిస్తున్నాయి. మన దేశంలో వారసత్వ పన్నును ఎస్టేట్ సుంకం పేరిట 1953లో అమలులోకి తెచ్చారు. దానిని రాజీవ్గాంధీ హయాంలో 1985లో రద్దుచేశారు.
వారసత్వ పన్నును మళ్లీ ప్రవేశపెడితే బాగుంటుందని, కాకపోతే అత్యంత సంపన్నులే లక్ష్యంగా పరిమితులు విధించాలని 2017లో మోదీ హయాంలోని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత వారసత్వ పన్ను అంశం ప్రముఖంగా ముందుకు వచ్చింది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్లో దీన్ని ప్రతిపాదిస్తారని అప్పట్లో వినిపించింది. ఇప్పటికే పెట్రో ధరలు, నిత్యావసర ధరలు పెంచేసి, ప్రజలకు అవసరమయ్యే అన్ని వస్తువులపై అధికంగా పన్నులు వసూలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇది చాలదన్నట్టు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తులపై కూడా పన్నులు వేయాలనుకోవడం దుర్భరం.
జాతీయ పార్టీల ఆలోచనా విధానమే ఇలా ఉంటుంది! వీటికి ఎంతసేపూ పన్నులు దండుకోవడంపైనే తప్ప ప్రజల సంక్షేమంపై దృష్టి ఉండదు. తెలంగాణలో గత పదేండ్లు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలకు పం చింది. గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, రైతుబంధు, దళిత బంధు వంటి పథకాల ద్వారా ప్రజలకు ఉపాధి కల్పిస్తూనే సంపద పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. అంతేకాకుం డా మౌలిక సదుపాయా లు కల్పించడం, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ద్వారా ప్రజల ఆస్తుల విలువను చాలా పెంచింది.
జాతీయ పార్టీలు ఇలా సంపద పెంచి, సంపద పంచే వ్యూహాన్ని ఎంచుకోకుండా వారసత్వ పన్నును భావావేశ సమస్యగా మార్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆశిస్తున్నాయి. ప్రాంతీ య పార్టీలు రాష్ర్టాలను అభివృద్ధి చేయడం, ప్రజలకు అవసరమైన లబ్ధి చేకూర్చడమే ప్రధానంగా పనిచేస్తున్నాయి. అందుకు దక్షిణాది రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలే నిదర్శనం. జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య ఉండే ఈ గుణాత్మ క తేడాను ఓటువేసే ముందు ప్రజలు గుర్తుంచుకోవడం మంచిది.