Karnataka | బెంగళూరు, ఏప్రిల్ 29: వివాహ ఆహ్వాన పత్రికలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించటం.. ఓ నవ వరుడ్ని ఇబ్బందుల్లో పడేసింది. ఎన్నికల కోడ్ను పర్యవేక్షిస్తున్న అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన పెండ్లి పత్రికలో..‘ప్రధానిగా మోదీని మరోసారి గెలిపించటమే మా జంటకు మీరు ఇచ్చే గొప్ప బహుమతి’ అని పేర్కొన్నాడు.
ఇది గమనించిన బంధువొకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 14న పుత్తూరు తాలుకాలోని వరుడి ఇంటికి ఎన్నికల అధికారులు వెళ్లారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే మార్చి 1న ఆహ్వాన పత్రికలు ముద్రించానని అతడు సమాధానమిచ్చాడు. అయినప్పటికీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.