కజకిస్థాన్లో ఈ నెల రెండవ తేదీ నుంచి దాదాపు వారం రోజుల పాటు చెలరేగిన హింసాయుత ఆందోళనలు అక్కడి ప్రజలలో పేరుకుపోయిన అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి. కార్లకు ఉపయోగించే ఎల్పీజీ ధరల పెరుగుదలపై నిరసన మొదట ఝానోఝన్ నగరంలో మొదలై ఇతర నగరాలకు విస్తరించింది. ఆందోళనకారులు విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు పలు ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు. వేలాది వ్యాపార సంస్థలు, బ్యాంకులు లూటీ అయ్యాయి. వందలాది పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి. కజకిస్థాన్ ప్రభుత్వం ఆందోళనలను అణచివేయడానికి రష్యా నుంచి సైనిక కూటమి దళాలను తరలించవలసి వచ్చింది. నిరసనలు అదుపులోకి వచ్చినప్పటికీ, తాజా అనిశ్చితి అక్కడి రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతున్నది. ఒకప్పటి సోవియట్ రిపబ్లిక్ అయిన ఉక్రెయిన్ ఇప్పటికే సంక్షోభంలో ఉన్నది. ఇప్పుడు కజకిస్థాన్ కూడా అగ్రరాజ్యాల వైషమ్యానికి వేదిక కాకూడదనే అభిప్రాయం వివిధ దేశాలలో ఉన్నది.
1990 దశకంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడానికి కొంచెం ముందు కజకిస్థాన్ స్వాతంత్య్రం ప్రకటించుకున్నది. కమ్యూనిస్టు పార్టీ కాలపు నాయకుడు నూర్సుల్తాన్ నజర్బయేవ్ ఇటీవలి వరకు నిరంకుశంగా పాలించాడు. 2019 జూన్లో ఆయన స్థానంలో టొకాయెవ్ దేశాధ్యక్షుడు అయినప్పటికీ రాజకీయ వ్యవస్థలో చెప్పుకోదగిన మార్పు లేదు. మరోవైపు మాజీ అధ్యక్షుడు నజర్బయేవ్ కుమార్తె దారిగా నజర్బయేవ్ కూడా దేశ నాయకత్వం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తాజా ఆందోళనలకు వీరి కలహాలు కొంత కారణమా అనే అభిప్రాయం కూడా ఉన్నది. కజకిస్థాన్లో సమృద్ధిగా శిలాజ ఇంధనాలతోపాటు, యురేనియం తదితర ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటి ఎగుమతుల ద్వారా భారీ ఆదాయం లభిస్తున్నప్పటికీ, ఆ సంపద అంతా కొన్ని కుటుంబాల దగ్గరే కేంద్రీకృతమై ఉన్నది. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి పేరుకుపోయింది. ఈ అసంతృప్తి ఆందోళనలను రగిలించిందని విశ్లేషకులు అంటున్నారు.
జనవరి 26న గణతంత్ర దినోత్సవానికి అతిథులుగా కజికిస్థాన్ సహా ఐదు మధ్య ఆసియా దేశాల నాయకులను ఆహ్వానించాలని భారత్ భావిస్తున్నది. అందువల్ల కజికిస్థాన్ సుస్థిరతను ఆకాంక్షిస్తూ ప్రకటన చేసింది. అఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మధ్య ఆసియా పరిణామాలను భారత్తో సహా ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఈ దేశాలలో ఎటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ సుస్థిరత దెబ్బతినకూడదనే అభిప్రాయం బలంగా ఉన్నది. పాలక వ్యవస్థలు కూలిపోయి అరాచకత్వం ప్రబలితే ఉగ్రవాద శక్తులు చెలరేగుతాయి. అందువల్ల ఈ దేశాలలో ప్రజాస్వామ్యం నెలకొనాలని, ఏ మార్పు అయినా శాంతియుతంగా జరగాలని కోరుకోవాలి.