స్వరాష్ట్ర సిద్ధి తర్వాత పరిఢవిల్లుతున్న రకరకాల సామాజిక విప్లవాల జాబితాలో ఇప్పుడు ‘తెల్లకోటు విప్లవం’ వచ్చి చేరింది. ఉద్యమవీరుడే సర్కారు సారథిగా పగ్గాలు చేపట్టి పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు. సమ్మిళిత అభివృద్ధిలో దేశానికే పాఠాలు నేర్పించారు. సమస్త రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపారు. ముఖ్యంగా వైద్యరంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి అద్వితీయం, అనన్య సామాన్యం. విశేషించి సర్కారు దవాఖానల సుస్తీని వదలగొట్టి సామాన్యులకు గుండె ధైర్యం కల్పించారు. వైద్యవిద్యను చూసి దేశం ఈర్ష్యపడేలా విస్తరించి ఔరా అనిపించారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధించిన పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని నిన్న ఆ శాఖ మంత్రి హరీశ్రావు విడుదల చేసిన నివేదిక కండ్లకు కట్టింది. అభివృద్ధి అవధులు దాటి విప్లవంగా పరిణమించిన తీరును విప్పిచెప్పింది. దశాబ్దకాలంలో దేశంలోని మరే ఇతర రాష్ట్రం ఇంతటి అభివృద్ధి సాధించిన దాఖలాలు మనకు కనిపించవు. సడుగులిరిగి మూలకు పడ్డ సర్కారు వైద్యం తేరుకుని కార్పొరేట్ వైద్యంతో పోటీపడటం తెలంగాణ తెల్లకోటు విప్లవానికి హైలైట్. ఆరోగ్య దశాబ్దిలో తెలంగాణ సాధించిన వైద్య విజయాలను గమనిస్తే అన్నిటిలోనూ సామాన్యులకు అండగా నిలిచి ఆదుకోవాలనే ఆర్తి నిండుగా కనిపిస్తున్నది. నిజానికి సామాన్యులే కాదు నేడు మాన్యులూ సర్కారు వైద్యాన్ని ఇష్టపడుతుండటం గమనార్హం.
వైద్యరంగాన్ని ఎన్నిరకాలుగా అభివృద్ధి చేయవచ్చో ఆచరణలో చూపారు సీఎం కేసీఆర్. వైద్యరంగం బడ్జెట్ను నాలుగు రెట్లు పెంచిన ఫలితంగా అధునాతనమైన, అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. వైద్యవిద్యలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి మెడికల్ కాలేజీల సంఖ్యను చూస్తే తెలిసిపోతుంది. స్వరాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం ఐదు ప్రభుత్వ వైద్యకళాశాలలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య ఆరు రెట్లు పెరిగి 28కి చేరుకున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీ అనే సృజనాత్మకమైన ఆలోచనతో సర్కారు ముందుకు పోతున్నది. ఇక సర్కారు నర్సింగ్ కళాశాలల సంఖ్య ఐదు నుంచి 23కు చేరుకున్నది. ఇక ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 850 నుంచి 3,915కు పెరిగాయి. ఈ పదేండ్లలో దవాఖానల్లో పడకలు రెట్టింపయ్యాయి. అత్యవసర వైద్య సేవలకు అవసరమయ్యే ఆక్సిజన్ పడకలు 30 రెట్లు పెరిగాయి. కొవిడ్ అనంతర కాలంలో వీటి ప్రాముఖ్యం ఏమిటో వివరించనక్కర్లేదు. 30 వేల వైద్యపోస్టులను భర్తీ చేశారు. ఒకప్పుడు డయాలసిస్ అంటే ఖర్చు చూసి జడిసేవారు. కానీ ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. వరంగల్లో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ దవాఖాన సిద్ధమైంది. రాజధాని హైదరాబాద్ నలువైపులా సర్కార్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిర్మితమవుతున్నాయి.
సర్కారు దవాఖానల్లో ఆరోగ్య సేవలు, స్వచ్ఛత, ఇతర సౌకర్యాలు మెరుగుపడటంతో వాటిపై ప్రజలకు నమ్మకం విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు రికార్డు స్థాయిలో జరుగుతుండటం శుభపరిణామం. సిజేరియన్లతో కాసులు రాల్చుకునే కార్పొరేట్ కల్చర్కు భిన్నంగా సహజ ప్రసవాలను అక్కడ ప్రోత్సహిస్తుండటం విశేషం. కేవలం వైద్య సేవలు బాగుపర్చడం మీదనే కాకుండా అన్ని రకాలుగా ఆసరా అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అందులో ప్రముఖంగా ‘కేసీఆర్ కిట్’ గురించి చెప్పుకోవాలి. దీంతో పాటే మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తున్నారు. గర్భిణులకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం, మందులు సమకూరుస్తున్నారు. ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను సర్కారు వాహనంలో ఇంటి దగ్గర దిగబెడుతున్నారు. గతంలో కనీవినీ ఎరుగని ఆప్యాయత ఇది. వీటన్నిటి ఫలితంగా మాతాశిశు సంరక్షణలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రం నిలుస్తున్నది. స్వరాష్ట్రం వస్తే ఏమొస్తది అని సణిగినోళ్ల నోళ్లు మూతలు పడేలా, తెలంగాణ వైద్యారోగ్య రంగం దేశానికే రోల్ మాడల్గా నిలువడం వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం కేసీఆరే అన్న మంత్రి హరీశ్ మాటలు అక్షర సత్యాలు.