పిల్లలు తమను పట్టించుకోకపోతే, వారి పేరన రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను తల్లిదండ్రులు వెనుకకు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేయడం వల్ల వృద్ధులకు ఎంతో ఊరట కలుగుతుంది. నిర్లక్ష్యానికి గురైన వృద్ధులు ఫిర్యాదు చేయడానికి, చట్టపరమైన రక్షణ పొందడానికి ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు చుట్టూరా సమాజం కూడా కొంత పట్టించుకుంటే వృద్ధులకు కష్టాలు తప్పుతాయి. సామాజిక, కుటుంబ విలువలు క్షీణిస్తున్న ఈ కాలంలో కన్న పిల్లలు పట్టించుకోకపోవడమనే కుసంస్కృతి పెరిగిపోతున్నది.
వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కొడుకు చేతిలో పెట్టి, అతడు గెంటేయడంతో రోడ్డున పడిన ఒక వృద్ధుడి దీనాలాపన ఆ మధ్య సంచలనం సృష్టించింది. పిల్లల నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధ తల్లిదండ్రుల వార్తలు తరచు వింటూనే ఉన్నాం. ఈ పెడ ధోరణిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనది. దేశానికే మార్గదర్శకమైనది.
వాస్తవానికి వృద్ధ తల్లిదండ్రులను దూరం చేసుకోవడం వల్ల పిల్లలు కోల్పోతున్నదే ఎక్కువ. కానీ ఆ విషయం పిల్లలకు బోధపడటం లేదు. పిల్లలు చదువుకొని ఏదో ఒక విభాగంలో కొంత పరిజ్ఞానం సంపాదించవచ్చు. కానీ ఏ జ్ఞానమూ జీవిత పరిజ్ఞానం కన్నా గొప్పది కాదు. వృద్ధులకు జీవితకాలపు అనుభవం ఉంటుంది. జీవిత పర్యంతం ఎత్తు పల్లాలను చవి చూసిన వృద్ధులు మనవలకు ఎన్నో జీవిత సత్యాలను బోధించగలరు.
ఆ జీవన తాత్వికతను ఒంటబట్టించుకున్న చిన్న పిల్లలు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు వచ్చినా నిబ్బరంగా ఎదుర్కొనగలరు. ఆ వృద్ధుల బోధనలు లేకపోవడం వల్లనే నేటి పిల్లలు చిన్న సమస్యలు ఎదురైనా తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వివాహ బంధాలు విచ్ఛిన్నమవడం, తప్పుడు నిర్ణయాలతో ఎదురు దెబ్బలు తినడం వంటి సమస్యలన్నీ పరిణత సలహాలు లోపించడం వల్లనే కలుగుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధం వారిని పక్కదారి పట్టకుండా కట్టిపడేస్తుంది. కుటుంబ, మానవ విలువలను కాపాడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమాన్ని మొదటి నుంచి అనేక విధాలుగా పట్టించుకుంటున్నది. ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తేవడం వల్ల వృద్ధులకు ఎంతో ఊరట కలుగుతున్నది. ఆసరా పింఛను వల్ల వారికి ఆర్థికంగా భరోసా కలగడమే కాకుండా కుటుంబంలో ఎంతో గౌరవం లభిస్తున్నది. ఇప్పుడు ఆస్తి బదిలీ చట్ట సవరణ వల్ల తల్లిదండ్రుల బాగోగులు పిల్లలు పట్టించుకోక తప్పదు. అయితే ఇదేదో నిర్బంధంలా కాకుండా పిల్లలు మనస్ఫూర్తిగా ఆచరిస్తే వారికే మంచిది. ఇవాళ వారు సంపాదిస్తుండవచ్చు. కానీ రేపు వారు కూడా వృద్ధులై తమ పిల్లలపై ఆధారపడక తప్పదు. పెద్దలను గౌరవించే సంస్కారాన్ని తాము అలవరచుకుంటే, అది పిల్లలకు పరోక్షంగా బోధించినట్టవుతుంది. తాము పెద్దలను నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు అదే సందేశాన్ని ఇచ్చినవారవుతారు. ఉత్తమ కుటుంబ సంబంధాలే తమకు భరోసా కల్పిస్తాయని అందరూ గ్రహించాలి.