కాలం చెల్లిన కాంగ్రెస్ను కర్రలు కట్టి నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నంగా ఖమ్మం సభను చూడవచ్చు. కృత్రిమ శ్వాసను ఎక్కించేందుకు ఆ పార్టీ నాయకులు తెగ ప్రయాస పడిపోయారు. కప్పల తక్కెడ పార్టీని రేపు తెలంగాణలో అందలం ఎక్కిస్తామని పగటి కలలు కంటున్నారు. అందుకు ఆధారాలు లేని అడ్డగోలు ఆరోపణలు, రొడ్డకొట్టుడు విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నచోట తామే అమలుచేయని హామీలు ఇక్కడ గుప్పిస్తున్నారు. దీనికి ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు చేసిన ప్రసంగాలే ఓ తాజా ఉదాహరణ. ఎడమొగం పెడమొగం నేతల మధ్య ఆ సభలో రాహుల్గాంధీ ప్రసంగం ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఏకరువు పెడుతున్న ఆరోపణలనే ఆయన చిలుక పలుకుల్లా వల్లించారు తప్పితే కొత్త విషయం ఏదీ లేదు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులపై వాటి వ్యయాన్ని మించిన అవినీతి జరిగిందనడం ఆయన పరిణతికి గల పరిమితికి అద్దం పడుతున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ సహా విపక్షాలు ఈ తరహా ఆరోపణలు ఎప్పటినుంచో చేస్తున్నప్పటికీ ఇంతవరకు పూచిక పుల్లంత ఆధారం చూపలేకపోయారన్న సంగతి రాహుల్గాంధీ మరిచారు. రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్టు అప్పజెప్పి మమ అనిపించారు. అవినీతితో, కుంభకోణాలతో ప్రజల తిరస్కారానికి గురై మూలకు పడ్డ పార్టీ నేత బీఆర్ఎస్పై ఆరోపణలు వల్లించి గురివింద గింజ సామెతను గుర్తుచేశారు. పనిలో పనిగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అనే అరిగిపోయిన రికార్డును మళ్లీ వినిపించారు. తెలంగాణలో బీజేపీకి పెద్దగా బలం లేదనీ.. కనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ అంటూ తమ పార్టీకి లేని బలం ఉన్నట్టు చెప్పుకోజూశారు. కేవలం పాలకపక్షాన్ని విమర్శిస్తే చాలదని అనుకున్నారేమో ఓటర్లకు తాయిలాల ఆశ చూపారు. తాము గనుక అధికారంలోకి వస్తే పింఛన్ రూ.4 వేలకు పెంచుతామని డొల్ల హామీని అట్టహాసంగా ప్రకటించేశారు.
అయితే ఇక్కడే మెలిక ఉన్నది. కాంగ్రెస్ ఇచ్చే అరకొర పింఛన్ను గణనీయంగా పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉన్న వృద్ధాప్య పింఛన్ను రూ.2016 కు పెంచారు. ఇక వికలాంగుల పింఛన్ కింద ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చింది రూ.500 మాత్రమే. దాన్ని ముందుగా కేసీఆర్ ప్రభుత్వం రూ.3,016 కు పెంచింది. ఇటీవలే దాన్ని రూ.4,116కు పెంచుతున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో పింఛన్ పెరుగుదల ఇలా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ అడ్డగోలు హామీతో ప్రజలను బురిడీ కొట్టించేందుకు సిద్ధమైంది. ఈ హామీ కేవలం తెలంగాణకే పరిమితమా? కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పింఛను మాటేమిటి? కర్ణాటకలో ఇచ్చేది కేవలం రూ.800. రాజస్థాన్లో రూ.750, ఛత్తీస్గఢ్లో రూ.350. ఆయా రాష్ర్టాల్లో పింఛన్ పెంచి ఇవ్వకుండా ఇక్కడ ఎందుకిస్తారు? ఎలా ఇస్తారు? అంటే కాంగ్రెస్ రాష్ర్టానికో నీతి పాటిస్తుందా?