‘మా వడ్లు కొంటరా? కొనరా?’- మహా ధర్నా వేదికగా గురువారం మోదీ సర్కార్కు ముఖ్యమంత్రి వేసిన ప్రశ్న చరిత్రాత్మకమైనది. ఇది వడ్ల కొనుగోలు కోసం తెలంగాణ రైతు వేస్తున్న ప్రశ్న మాత్రమే కాదు. మోదీ సర్కారు వైఫల్యాలపై, నిర్లక్ష్యంపై దేశ రైతుల తరఫున కేసీఆర్ ఎక్కు పెట్టిన బాణమిది. సందర్భం వడ్ల కొనుగోలు నేపథ్యంలోంచి వచ్చిందే కావచ్చు. కానీ అది మొత్తం వ్యవసాయ సంక్షోభానికి సంబంధించినది. కేసీఆర్ ఇప్పుడు ఒక్క తెలంగాణ రైతుల గురించే ఆలోచించడం లేదు. దేశ వ్యవసాయ సంక్షోభం గురించి ఆవేదన చెందుతున్నారు. కొన్నేండ్లుగా అనేక రాష్ర్టాలలో రైతులు ఆందోళన బాట పట్టారు. కాల్పులకు ఎదురు నిలిచారు. ఢిల్లీలో ఎండనకా, వాననకా ఏడాదిగా ధర్నా చేస్తున్నా, కేంద్రం కిమ్మనకపోవడమేమిటనేది కేసీఆర్ విసురుతున్న ప్రశ్న.
కేసీఆర్ చెప్పినట్టు మన దేశానికి ప్రకృతి ఇచ్చిన వరాల లాంటి నదులున్నాయి. 65 వేల టీఎంసీల జలాలున్నాయి. దేశంలోని 40 కోట్ల ఎకరాలకు సాగు నీరు, ప్రజలు అందరికి మంచినీరు అందించినా, ఇంకా 15 వేల టీఎంసీల నీరు మిగిలే ఉంటుంది. పుష్కలంగా విద్యుత్ లభ్యత ఉన్నా దానిని వాడుకోవడం లేదు. మరోవైపు ప్రపంచ ఆకలి సూచి ప్రకారం- భారత్ పరిస్థితి దయనీయంగా ఉన్నది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ కన్నా మనదేశం వెనుకబడి ఉండటమేమిటి? ఇదీ కేసీఆర్ బాధతో, బాధ్యతతో అడుగుతున్న ప్రశ్న. ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా, విదేశీ బూచి చూపిస్తూ ఎంత కాలం పబ్బం గడుపుతారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దేశ ప్రజలు కడగండ్ల పాలవుతుంటే, చూస్తూ ఉండలేక వారి కోసం పోరాడాలని కేసీఆర్ నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతుల తరఫున సమర శంఖం పూరించడానికి అన్ని అర్హతలున్న నాయకుడు కేసీఆర్ మాత్రమే అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆయన తెలంగాణలో వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించిన తీరు ఆదర్శప్రాయమైనది. ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందే నాయకులకు భిన్నంగా పరిష్కారాలు సాధించే పరిపాలకుడిగా కేసీఆర్ గుర్తింపు పొందారు. లక్ష్యం సాధించే వరకు మొండిగా పోరాడే చిత్తశుద్ధిగల నాయకుడిగా ఇప్పటికే రుజువు చేసుకున్నారు. స్వాతంత్య్ర సమర కాలంలో దేశానికి బెంగాలీ సమాజం మార్గదర్శకమైంది. ఇప్పుడు దేశాన్ని కొత్త మలుపు తిప్పవలసిన చరిత్రాత్మక బాధ్యతను తెలంగాణ సమాజం స్వీకరించవలసి ఉన్నది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర రైతు లోకం యావత్తూ ఉద్యమించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయవలసిన తరుణమిది. మన పోరాటం మన కోసమే కాదు, దేశ సమస్యల పరిష్కారం కోసమని తెలంగాణ రైతులు గ్రహించాలి. ఈ పోరాటం ఇక్కడితో ఆగకూడదు. దేశంలో ఇది మరొక స్వాతంత్య్రోద్యమం అని భావించాలి.