హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): ఉర్దూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పదో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అజార్ ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉర్దూ భాషాభివృద్ధికి సీఎం, సంబంధిత శాఖల మంత్రులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు ఎంఏ మాజిద్, ప్రధాన కార్యదర్శి ఎస్డీ గౌస్ మొహియుద్దీన్ పాల్గొన్నారు.