కొత్తగూడెం ప్రగతి మైదాన్, సెప్టెంబర్ 19: నాటుసారా తయారీ, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణపై సమీక్షించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక వంటి ముడిసరుకుల సరఫరాదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గంజాయి రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొత్తగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో అకస్మిక తనిఖీ చేపట్టిన డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి గంజాయి, నాటుసారాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. ఈ సందర్భంగా.. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఇప్పటివరకు 15 గుడుంబా, బెల్లం కేసులు, 5 అనధికార మద్యం కేసులు నమోదు చేసినట్లు అధికారులు ఆయనకు తెలిపారు. ఈ కేసుల్లో 18 మందిని అరెస్టు చేసి, 17 మందిని బైండోవర్ చేసినట్లు వారు పేర్కొన్నారు. 39 లీటర్ల గుడుంబా, 440 కిలోల బెల్లం, 25 కిలోల పటిక, 8.28 లీటర్ల ఐఎంఎల్, 250 లీటర్ల నాటుసారా ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి నాటుసారా కేసుల్లో పట్టుబడిన ఇద్దరిపై బ్రీచ్ బాండ్ కింద ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.లక్ష జరిమానా విధించి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నాటుసారా తయారీ, విక్రయాలు, రవాణా, గంజాయి అక్రమ రవాణా లేదా నాటుసారా ముడిసరుకుల సరఫరాపై సమాచారం ఉంటే ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ నల్లమల శ్రీనివాసరావు, కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేమ రాజశేఖర్ రావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.