రాయపోల్, సెప్టెంబర్ 19: వినాయక చవితి పర్వదినాన్ని పునస్కరించుకొని సంప్రదాయ మట్టి గణపతిని ప్రతిష్టించిన రాంసాగర్ గ్రామ ప్రజలను శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అభినందించారు. హానికరమైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాలతో తయారైన విగ్రహాలకు స్వస్తి పలికి, పర్యావరణ పరిరక్షణకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ గ్రామ మట్టి గణపతి కమిటీని శనివారం ఆయన ఘనంగా సన్మానించారు.
శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడుతూ.. నేటి తరానికి భక్తితో పాటు బాధ్యత కూడా అవసరమని అన్నారు. మట్టి గణపతిని పూజించడమే నిజమైన పర్యావరణ పరిరక్షణ అని ఆయన తెలిపారు. 22 ఏళ్లుగా మట్టి గణపతి ఉద్యమాన్ని భుజానికెత్తుకుని లక్షలాది మందిలో చైతన్యం నింపుతున్నామని, ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా రామరాజు వెల్లడించారు.

రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో మట్టి గణపతే కొలువుదీరాలని ఆయన ఆకాంక్షించారు. మట్టి గణపతి ఉద్యమాన్ని ఉద్యమంలా ప్రతి పల్లెకు తీసుకెళ్తున్న రామకోటి రామరాజు సేవలు చిరస్మరణీయమని గ్రామస్తులు, భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షులు ఏమిశెట్టి వెంకటేష్, మాజీ సర్పంచ్ ఆదిరెడ్డి, మెట్టయ్య, రుక్మయ్య, గణేష్, వెంకట్ గౌడ్, నర్సింలు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.