అభివృద్ధి ముందంజలో కాకపోయినా వెనుకంజలో మాత్రం మోదీ సర్కారు రికార్డుల మీద రికార్డులను నెలకొల్పుతున్నది. కేంద్ర ప్రభుత్వం వారి కీరి ్తకిరీటానికి కొత్త కలికితురాయి రూపాయి విలువ పతనం! ఒక అమెరికన్ డాలరుకు రూ.77.41 మేర విలువ క్షీణించింది. ఇది మన దేశ ఆర్థికరంగ చరిత్రలోనే అతిపెద్ద క్షీణత. భారత కరెన్సీ విలువ ఎన్నడూలేని స్థాయికి పడిపోవటం బీజేపీ హయాంలో తరచూ చోటుచేసుకుంటున్న పరిణామం. గడిచిన మార్చి నెలలో 76.98కి రూపాయి క్షీణించటమే దారుణం అనుకుంటే ఇప్పుడు మరింత దిగజారింది. అసలే ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థికవ్యవస్థకు ఇది మరింత దెబ్బ. దీనివల్ల విదేశీ నిధులు దేశీయ ఈక్విటీల నుంచి వైదొలుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 1,770 కోట్ల డాలర్లను విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు.
చూడబోతే ఇదంతా సాధారణ లెక్కల పద్దులాగే కనిపిస్తుందిగానీ.. దీని ప్రభావం దేశంలోని కోట్లాదిమంది పేద, మధ్యతరగతి ప్రజానీకంపై తీవ్రంగా ఉండనుంది. కేంద్రం అంతులేని ధనదాహం, అసమర్థ ఆర్థిక విధానం ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే వంద దాటాయి. వంట గ్యాస్ ధర వెయ్యికి మించిపోయింది. అంతర్జాతీయంగా వాటి రేట్లు గణనీయంగా తగ్గినప్పుడు ఆ లాభాన్నంతా ఖజానా నింపుకోవటానికి ఉపయోగించుకున్న మోదీ ప్రభుత్వం, రేట్లు పెరిగినప్పుడు మాత్రం ప్రజలపై భారం వేస్తున్నది. దశాదిశా లేని ఈ అస్తవ్యస్త పాలనకు కరోనా, రష్యా-ఉక్రయిన్ యుద్ధం తోడైనాయి. దీంతో సామాన్యుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డైట్టెంది. ఇటువంటి వ్యక్తి కేంద్ర పాలన, ఒంటెత్తు పోకడల ఫలితంగానే పొరుగుదేశం శ్రీలంక సంక్షోభంలో మునిగి గింజుకుంటున్నది. ఒక డాలరుకు 359.66 మేర శ్రీలంక రూపాయి పతనమైంది.
ప్రపంచమంతా సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు కూడా నిబ్బరంగా నిలిచిన ఆర్థిక వ్యవస్థ మనది. ఆర్బీఐ వంటి సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ రాజకీయాలకు అతీతంగా గట్టి నిర్ణయాలు తీసుకోవటం, అంతర్జాతీయ మార్కెట్లపై మరీ ఎక్కువగా ఆధారపడకుండా దేశీయంగా అభివృద్ధి చెందటం వంటి కారణాలు మన దేశాన్ని కాపాడాయి. దేశంలో పేదరికం, అవినీతి వంటి వ్యవస్థీకృత సమస్యలు ఎన్ని ఉన్నా భారత ఆర్థికరంగం సాపేక్షికంగా స్థిరత్వాన్ని కలిగి ఉండేది.
కానీ మోదీ పాలన మొదలైన తర్వాత ఆర్థికవ్యవస్థ బీటలు వారటం మొదలైంది. ప్రధాని మోదీ నిపుణుల సలహాలు పెడచెవిన పెట్టి, తనకు తోచిన విధంగా అర్ధరాత్రి నోట్ల రద్దు, ఆకస్మిక లాక్డౌన్లు వంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆర్థికరంగం అతలాకుతలమైంది. రఘురామ్ రాజన్, అమర్త్యసేన్ వంటి అంతర్జాతీయస్థాయి ఆర్థికవేత్తలు కూడా ఈ ప్రభుత్వానికి చెప్పటం దండగ అన్నట్లు ఉండిపోయే పరిస్థితి వచ్చింది. మత ఉద్వేగాలు రేపడం వల్ల కాకుండా సమర్థతతో ప్రజల మెప్పు పొందడానికి మోదీ ప్రయత్నిస్తే ప్రజలకు, దేశానికి శ్రేయస్కరం.