కొందరు తల్లి దండ్రులు తమ సంతానం కోసం తరతరాలు తిన్నా తరగని ఆస్తులు కూడబెడతారు. కానీ భూగోళమే నివాసయోగ్యంగా లేనప్పుడు, మానవాళి మాత్రమే కాదు, సమస్త జీవరాశి అంతరించి పోయే ప్రమాదం ఏర్పడిన తరువాత, ఎన్ని ఆస్తులు కూడగట్టి ఏమి లాభం? ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో చెట్లను కాపాడుకోవాలనే స్పృహ పెరిగిపోయింది. అడవులను కాపాడటం పౌరుల హక్కు-బాధ్యత అనే భావన బలపడుతున్నది. ఈ నేపథ్యంలో వృక్ష పరిరక్షణలో ప్రజల బాధ్యతను, భాగస్వామ్యాన్ని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘హరిత నిధి’ వినూత్నమైనది, అభిలషణీయమైనది. ఉద్యోగులు మాత్రమే కాదు, విద్యార్థులు కూడా ఎంతో కొంత మొత్తం హరిత నిధికి అందజేసినప్పుడు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యత ఏర్పడుతుంది.
‘కాలుష్యంతో మచ్చలు పడ్డ వసుధ కంఠానికి అలంకరిస్తున్న పచ్చలహారమే హరితహారం’ అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారానికి ఓ కవి అక్షర నీరాజనం పట్టాడు. ఏడేండ్లుగా కొనసాగుతున్న ఈ పర్యావరణ యజ్ఞంలో మరో కీలక నిర్ణయం హరితనిధి ఏర్పాటు. మొక్కలను పెంచి, చెట్లను సంరక్షించే మహోన్నత కార్యక్రమానికి దీని ద్వారా శాశ్వత భరోసాను కల్పించినట్లయింది. 2015లో ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు 230 కోట్ల మొక్కలను నాటాలనేది లక్ష్యం. ఈ ఏడాది హరితహారం ఏడో దఫా ముగిసేనాటికి ఈ లక్ష్యాన్ని అధిగమించి మొత్తంగా 239 కోట్ల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు తద్వారా భవిష్యత్ తరాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సాగుతున్న కృషి ఫలితమిది. చైనాలో గ్రీన్వాల్, అమెజాన్ నది వెంట 100 కోట్ల చెట్ల పెంపకం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పరిరక్షణ మానవ ప్రయత్నంగా హరితహారం రికార్డులను సృష్టించింది.
హరితహారం మూలంగా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 24 నుంచి 28 శాతానికి పెరిగింది. చెట్లను అత్యధికంగా పెంచుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రశంసించింది. ఈ మహత్తర కార్యక్రమం ఇకముందు కూడా నిరాటంకంగా సాగాలంటే అందుకు ప్రజలు తమ బాధ్యతను గుర్తించి భాగస్వాములు కావాలి. తగినమేర నిధులు కూడా ఉండాలి. హరితహారంలో ఇప్పటికే గ్రామ పంచాయతీలు కీలక పాత్ర వహిస్తున్నాయి. ఇప్పుడు హరిత నిధి ఏర్పాటు వల్ల ప్రజా భాగస్వామ్యం పెరుగడంతో పాటు, నిధులను సమీకరించవచ్చు. హరిత నిధి ఏర్పాటు వెనుకగల లక్ష్యాన్ని అర్థం చేసుకొని ఉద్యోగస్థులు, విద్యార్థులు తమ వంతు విరాళమివ్వాలి. వృక్ష పరిరక్షణకు తోడ్పడటం ద్వారా భవిష్యత్ తరాలకు భరోసా ఇస్తున్నామని భావించాలి.