ఓటర్ల జాబితా సవరణపై సీఈవోతో భేటీ అనంతరం మీడియాతో మాజీ ఎంపీ వినోద్
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ముసాయిదాలో ఓటర్ల పేర్లు ఉండి, సరైన డాక్యుమెంట్లు సమర్పించని 92 లక్షల మందికి నోటీసులు జారీచేస్తామని సీఈవో సమావేశంలో చెప్పారని, నోటీసులకు సమాధానం చెప్పే గడువు నెల రోజులుగా నిర్ణయించడం సరికాదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. అన్ని లక్షల దరఖాస్తులు, ఆక్షేపణలను పరిశీలించడానికి కేవ లం 30 రోజుల గడువు సరిపోదని, రాష్ట్రం లో ఇపుడు ఏ ఎన్నికలు లేనందున గడువును మరింత పెంచాలని కోరారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) కూడా త్వరలోనే లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున వినోద్కుమార్తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్, నాయకుడు వై సతీశ్రెడ్డి హాజరయ్యారు.
అనంతరం వినోద్కుమార్ మీడియా తో మాట్లాడుతూ.. తెలంగాణలో తాజాగా ప్రచురించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తుది ఓట ర్ల జాబితా కాదని, ఓటర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని అర్హతలుండి లిస్టులో పేరు లేనివారు, లేదా వేరే ప్రాంతాలకు మారిన వారు ఫారమ్-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఇదే విషయాన్ని విస్తృతం గా ప్రచారం చేయాలని ఎన్నికల కమిషన్ను కోరినట్టు తెలిపారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటర్ నమోదుపై ఎకువ ఆసక్తి చూపుతున్నారని వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేనందున, అధికారులు హడావుడి పడకుండా, ప్రతి ఓటరుకూ స్పష్టమైన అవకాశం కల్పి స్తూ సమగ్రంగా ఓటర్ల జాబితాను రూపొందించాలని కోరారు. ఓటర్ల తుది జాబితా ప్రచురించే వరకు అర్హులైన ఓటర్లు ఎవ్వరికీ నష్టం కాకుండా బీఆర్ఎస్ తన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.