పదుల సంఖ్యలో మరణాలు, వందల సంఖ్యలో గృహదహనాలు, ప్రార్థన మందిరాల ఆహుతి తర్వాత మణిపూర్ కొద్దిగా సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ, అది నివురుగప్పిన నిప్పేనని మూడు వారాల్లోనే తేలిపోయింది. మరోసారి రాష్ట్రం మంటల్లో చిక్కుకుపోయింది. దాదాపు 40 మంది తీవ్రవాదులను ఎన్కౌంటర్లలో మట్టుబెట్టినట్టుగా ముఖ్యమంత్రి బీరేన్సింగ్ ప్రకటించారు. అయినప్పటికీ, శాంతిభద్రతలు నెలకొనలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. మెజారిటీ ప్రజలైన మైతీలకు ఎస్టీ హోదా ఇచ్చే దిశగా రాష్ట్ర హైకోర్టు మార్చి 27న తీర్పు వెలువరించిన నేపథ్యంలో, తలెత్తే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అంచనా వేయలేదు. శాంతిభద్రతలు అదుపు తప్పకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టలేదు.ఆ తర్వాత చెలరే గిన హింసాకాండను అదుపు చేయటంలోనూ సమర్థతను చూపలేదు. ఫలితంగా, రాష్ట్రం జాతి విద్వేష అగ్నికీలల్లో చిక్కుకుపోయింది.
ఇటువంటి సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రి బీరేన్సింగ్ ఎంతో సంయమనంతో, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా, ఆయన మైతీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. కుకి తెగకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఆరోపణ చేయటం విశేషం. మైతీలతో కలిసి ఉండటం సాధ్యం కాదని, తమకు విడి గా ప్రత్యేక పాలన యంత్రాంగం కావాలని నేడు కుకి తెగ ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేయటం పరిస్థితి ఎంత సంక్లిష్టంగా మారిందో తెలుపుతున్నది. సమస్యను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభు త్వం విఫలమవుతున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సింది. కానీ, కేంద్రానికి ఆ సోయే లేకుండా పోయింది. ఓవైపు మణిపూర్ తగలబడిపోతుంటే, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. మయన్మార్తో సరిహద్దును పంచుకునే మణిపూర్లో హింసాకాండ చెలరేగి, సున్నిత పరిస్థితులు నెలకొనటం దేశ సుస్థిరత కోణంలో కూడా పరిశీలించాల్సిన అంశం. అయినప్పటికీ, కేంద్రం నిప్పును చల్లార్చే యత్నాలు చేయలేదు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు అమిత్షా మణిపూర్కు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే చిత్తశుద్ధి కేంద్రానికి ఉంటే, తక్షణ, దీర్ఘకాలిక చర్యలను చేపట్టాలి. కుకీ, మైతీల ఘర్షణ పైకి జాతివైరంగా కనిపిస్తున్నప్పటికీ దాని వెనుక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాలున్నాయి. రాజకీయంతోపాటు అన్నిరంగాల్లో మైతీల ఆధిపత్యం నెలకొని ఉండటం మీద కుకీల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. తమకు రక్షణనిస్తున్న ఎస్టీ హోదాలోకి మైతీలను తీసుకొస్తే ఉన్న ఆ కొద్దిపాటి అవకాశాలను కూడా కోల్పోతామన్న ఆందోళన వారిది. మతపరమైన భేదాలు దీనికి తోడయ్యాయి. మయన్మార్ నుంచి తరలివస్తున్న కాందిశీకుల సమస్య ఉండనే ఉంది. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మిలిటెన్సీ తలెత్తకుండా, దానికి ప్రజల మద్దతు పెరగనివ్వకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యను పరిష్కరించాలి. మరి మోదీ ప్రభుత్వం ఇకనైనా మేల్కొంటుందా?