సింగరేణి విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారు తడిగుడ్డతో గొంతు కోసే విధంగా వ్యవహరిస్తున్నది. సింగరేణిని ప్రైవేటీకరించే యోచనే లేదని, దానిపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమని రామగుండం ప్లాంటు ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ చెప్పుకొచ్చారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం కాగా కేంద్రం వాటా 49 శాతమేనని, తాము ఏకపక్షంగా ఎలా ప్రైవేటీకరిస్తామని అమాయకంగా ప్రశ్నించారు. ఇది జరిగి నెల రోజులు కూడా కాలేదు. ఇంతలోనే కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ దేశంలోని 133 బొగ్గు బ్లాకులను బెంగళూరులో వేలానికి పెట్టింది. వాటిలో తెలంగాణలోని గోదావరి లోయ బొగ్గుగనుల పరిధిలో ఉన్న నాలుగు బ్లాకులు కూడా ఉన్నాయి. వీటిని సింగరేణికి కేటాయించమని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి విజ్ఞాపనలు ఇచ్చారు. అయినా సమ్మతించని కేంద్రం వేలంపాటలో వీటిని కూడా చేర్చింది.
సింగరేణి కాలరీస్ పనే బొగ్గు ఉత్పత్తి. బొగ్గు గనులను ఆ సంస్థకు కేటాయించకుండా, వాటిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తే సింగరేణి ఏ విధంగా పని చేయగలుగుతుంది? దేశంలో బొగ్గు గనులను కేటాయించే అధికారం కేంద్రానికే ఉన్నది. మోదీ హయాం వరకూ కేంద్రప్రభుత్వాలు వేలంతో ప్రమేయం లేకుండా, బొగ్గు గనులను సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేటాయించేవి. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను కూడా పరిగణనలోకి తీసుకునేవి. మోదీ వచ్చిన తర్వాత ఈ సత్సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. వేలంపాటలో మీరు కూడా పాల్గొనమంటూ ప్రభుత్వ సంస్థలకు ఉచిత సలహా ఇవ్వటం ప్రారంభించారు. లాభార్జనే ధ్యేయంగా ఉండే ప్రైవేటు కంపెనీలతో, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పని చేసే ప్రభుత్వ సంస్థలు ఎందుకు పోటీ పడాలి? ఎవరి కోసం మోదీ సర్కారు ఈ పోటీని నిర్వహిస్తున్నది? ఎల్ఐసీ వంటి దిగ్గజ ప్రభుత్వరంగ సంస్థలను అడ్డికి పావుశేరు లెక్కన అమ్మి, తమకు నచ్చిన కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్న కేంద్రం వైఖరి ఈ విషయంలోనూ అనుమానాస్పదంగా ఉన్నది.
ఏపీలోని విశాఖ ఉక్కు సంస్థకు ఇనుప గనులను కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టి, క్రమంగా అమ్మకానికి పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. సింగరేణి విషయంలో కూడా ఇటువంటి కుటిల నీతినే అమలుపరుస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఇదే మోదీ సర్కారు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోరిక మేరకు లిగ్నైట్ బ్లాకులను కేటాయించింది. గుజరాత్కో నీతి, ఇతర రాష్ర్టాలకో నీతి. రాష్ర్టావిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సింగరేణి అద్భుత ప్రగతిని సాధించింది. 2014లో రూ.11,923 కోట్లు ఉన్న టర్నోవర్ నేడు రూ.26 వేల కోట్లను దాటింది. బొగ్గు ఉత్పత్తి 450 లక్షల టన్నుల నుంచి 650 లక్షల టన్నులకు చేరుకున్నది. సింగరేణి నుంచి దాదాపు రెండువేలకుపైగా పరిశ్రమలకు బొగ్గు సరఫరా జరుగుతున్నది. వేల మంది కార్మికులు సింగరేణిపై ప్రత్యక్షంగా, పరో క్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణ సమాజమంతా ఐక్యంగా నిలిచి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సింగరేణిని కాపాడుకోవాలి.