Congress | ‘వెనుకాముందూ చూసుకోకుండా హామీ ఇచ్చేయడం, తర్వాత వల్లకాదని చేతులెత్తేయడం కాంగ్రెస్ తత్వం’ అని చెప్పుకోవాలేమో. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ భోషాణం స్వాగతం పలికిందని పరిణతి లేని మాటలతో పరిపాలన మొదలుపెట్టారు పాలకులు. కొత్త ప్రభుత్వం గద్దెనెక్కి నాలుగు నెలలు కావస్తున్నది. హామీల అమలుపై పూటకోమాట చెప్పి తప్పించుకోవడం కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారింది. తాజాగా రైతు రుణమాఫీపై మాటతప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ‘హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ, రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటుందని అనుకోలేదు’ అనే మాటలు సర్కారు వైపు నుంచి వినిపిస్తుండటమే అందుకు కారణం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల పరిపాలనా అవగాహనను, సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నదని చెప్పక తప్పదు. రుణభారాన్ని సాకుగా చూపి రైతు రుణమాఫీపై మొండిచెయ్యి చూపాలన్న ఆలోచన సర్కారు చేస్తున్నట్టు సందేహాలు కలుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు అలా చేయడం కుదరదు గనుక ఫలితాలు వెలువడిన తర్వాత చావుకబురు చల్లగా చెప్తారేమో.
రూ.2 లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడలేదు. మరోవైపు బకాయిల వసూలు కోసం బ్యాంకర్లు రైతులను వేధింపులకు గురిచేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రైతుబంధు అందక పెట్టుబడి సాయం కోసం తంటాలు పడుతూ, సాగునీరు లేక పంటలెండుతూ సతమతమవుతున్న రైతులకు ఇది పిడుగుపాటే అవుతుందనడంలో సందేహం లేదు. రైతుబంధు పెంచడం మాటేమో గానీ, ఇదివరకు ఇస్తూ వచ్చింది కూడా ఆలస్యమవుతున్నది. కొద్దిమందికి ఇచ్చి చేతులెత్తేశారు. రైతుబంధు సొమ్ము జీతాలకిచ్చేశామని పాలకులు చెప్పారు. నిరుద్యోగ భృతి విషయంలో నాలుక మడతేశారు. అసలా హామీ ఇవ్వనేలేదని అంటున్నారు. ఉచితాల విషయంలో తెల్లరేషన్ కార్డు లంకె పెట్టడంతో చాలామంది లబ్ధిని నోచుకోలేకపోయారు.
అధికారం దక్కుతుందో లేదోననే ఆతృతలో 420కి పైగా హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజల మీదకు వదిలింది. ఉచితాల పేరుచెప్పి ఊదరగొట్టింది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినదానికన్నా అదనంగా ఇంకేదో దక్కుతుందని ప్రజలు కూడా కొంతవరకు నమ్మారు. ఫలితం తెలిసిందే. అధికారం దక్కించుకున్న తర్వాత వాటిని అమలు చేయలేక కుంటిసాకులతో తప్పించుకోవాలని హస్తం సర్కార్ చూస్తున్నది. హామీలను తూచ్ అంటుండటంతో నమ్మి ఓటేసిన ప్రజల పరిస్థితి అయోమయంగా తయారైంది. వ్యక్తిగతంగా మాట ఇచ్చి తప్పడం అనేది మామూలుగానే జరుగుతుంది. అలా జరిగినప్పుడు ‘పాపం వీలు కాలేదోమో’నని సరిపెట్టుకుంటారు. కానీ, ప్రజాపాలనకు సంబంధించిన వ్యవహారంలో అది అభాసుపాలు చేస్తుంది. హామీలు ఇస్తున్నప్పుడు రాష్ట్ర ఆర్థికస్థితి ఏమిటో కాంగ్రెస్ నేతలకు తెలియదా? అదేమన్నా చిదంబర రహస్యమా? రాష్ట్ర ఆదాయవ్యయాలు బడ్జెట్ రూపంలో అసెంబ్లీకి సమర్పించకుండా ఏ సర్కారు అయినా తన ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తుందా? ఆపై ప్రభుత్వ వ్యయంపై కాగ్ విశ్లేషణ కూడా అందరికీ ఉంటుంది. గత అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులే లేరా? వారు ఆర్థిక చర్చల్లో పాల్గొనలేదా? ఎన్నికలకు ముందే అప్పుల గురించి నానాయాగీ చేసిన కాంగ్రెస్ ఆర్థిక పరిస్థితి తెలిసే అన్ని హామీలు ఎందుకు గుప్పించింది? ఇప్పుడు మళ్లీ అవే అప్పులను చూపించి హామీలను అటకెక్కించాలని చూడటం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పటికైనా సాకులు వెదకడం, అమాయకత్వం నటించడం మానేసి హామీలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే బాగుంటుంది.