అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదిగిన కర్పూరీ ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించడం ముదావహం. సోషలిస్టు నేతల్లో మొదటి కాంగ్రెసేతర బీహార్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన కర్పూరీ ఠాకూర్ స్థానం విశిష్టమైంది. రాజనీతిజ్ఞుడిగా, పరిపాలనాదక్షుడిగా, మచ్చలేని వ్యక్తిగా పేరుపొందిన ఆయన హయాంలోనే బీహార్లో ఓబీసీ రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా అమల్లోకి వచ్చాయి. ఆయన అమలు చేసిన విధానం తర్వాతి కాలంలో ‘కర్పూరీ ఠాకూర్ ఫార్ములా’గా ప్రసిద్ధి పొందింది. ‘జననాయక్’ అనే ప్రజాబిరుదు ఆయన ఇంటిపేరుగా మారింది. బీహార్ నుంచి జాతీయ నేతలుగా ఎదిగిన నితీశ్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్ తదితరులకు కర్పూరీ రాజకీయ గురువు కావడం విశేషం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత తరుణంలో ఆ మహానేతకు పురస్కారాన్ని ప్రకటించడంపై ఓ వైపు ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయన వారసత్వాన్ని సొంతం చేసుకునేందుకు బీహార్లోని కీలక పార్టీలు పోటీ పడుతుండటం గమనార్హం. బీహార్లోని అత్యంత వెనుకబడిన (ఈబీసీ) నాయీ సామాజికవర్గానికి చెందిన కర్పూరీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవార్డు ప్రకటించడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కావడంలో విశేషం ఏమీ లేదు. ఇటీవల బీహార్లో జరిపిన కులగణనలో ఏయే వర్గాల వాటా ఎంతో తేలిపోయింది.
బీహార్ జనాభాలో ఈబీసీలు 36 శాతం పైగా ఉంటారు. ఇది ఏకైక, అతిపెద్ద సామాజికవర్గాల సమూహంగా ఉన్నది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వీరి ఓట్లు అత్యంత కీలకమని చెప్పాల్సిన పని లేదు. బీహార్ పాలక కూటమిలోని జేడీయూ, ఆర్జేడీ, విపక్ష బీజేపీ ఈ వర్గం ఓట్ల కోసం పావులు కదుపుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవార్డు ప్రకటించిన దరిమిలా బీహార్ పాలక కూటమిలోని రెండు జనతా పరివార్ పార్టీలు (జేడీయూ, ఆర్జేడీ) పాట్నాలో విడివిడిగా సభలు పెట్టి సందడి చేశాయి. బీజేపీ కూడా ఓ సభ ఏర్పాటు చేసి ఆ రెండు పార్టీల నాయకులపై విమర్శలు చేయడం కొంత ఎబ్బెట్టుగానే ఉందని చెప్పకతప్పదు.
ఏదిఏమైనప్పటికీ శతజయంతి సంవత్సరంలో, అదీ దివంగతులైన 35 ఏండ్ల తర్వాత కూడా బీహార్ రాజకీయాల్లో కర్పూరీ ఠాకూర్ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన ‘జననాయక్’ సామాజిక న్యాయం కోసం అలుపులేని పోరాటం చేశారు. కాంగ్రెస్ హయాంలో హిందీ రాష్ర్టాల్లో అమలుకు నోచుకోని రిజర్వేషన్లకు మోక్షం కల్పించి పథనిర్దేశకుడిగా నిలిచారు. రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించినా మచ్చలేని నేతగా మిగిలిపోయారు. సమాజంలోని అణగారిన, అట్టడుగు వర్గాల ప్రజల కోసం నిరంతరం తపించారాయన. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయిన వర్గాలకు దామాషా ప్రకారం చిత్తశుద్ధితో రిజర్వేషన్లు కల్పించడమే కర్పూరీ ఠాకూర్ స్మృతికి నిజమైన నివాళి అవుతుంది.