ఏ వ్యక్తీ తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టలేడు. ఏ జాతీ తన అస్తిత్వాన్ని పణంగా పెట్టలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ అస్తిత్వ ఉద్యమ ఫలితమే యాభై ఏండ్ల కిందట బంగ్లాదేశ్ ఆవిర్భావం. భారత్ అందించిన స్నేహ హస్తంతో బంగాలీలు పాకిస్థాన్ చెర నుంచి విముక్తి సాధించుకున్నారు. మతం పేరిట దేశాన్ని నిర్మించాలన్న పాకిస్థానీ భావననే బద్దలు కొట్టారు. బంగ్లా విముక్తి ఉద్యమం భాషా ఉద్యమంగా ఉదయించినా అదొక జాతి అస్తిత్వ పరిరక్షణ ఆకాంక్షే. మాతృభాషకు జరుగుతున్న అవమానాన్ని వారు సహించలేక పోయారు. తమ రాష్ర్టానికి తమ బంగ్లా పేరు కాకుండా ఈస్ట్ పాకిస్థాన్ అని పెట్టడాన్ని భరించలేకపోయారు. 1970 ఎన్నికలలో ముజిబ్ నాయకత్వంలోని అవామీ లీగ్ మెజారిటీ సాధించినా అధికారం అప్పగించకపోవడంతో ఇక బంగాలీలు విడిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
1952లో భాషా పరిరక్షణ ఉద్యమంపై జరిపిన పోలీసు కాల్పుల్లో పలువురు విశ్వవిద్యాలయ విద్యార్థులు, పౌరుల అమరత్వం బంగ్లా విమోచనోద్యమానికి పునాది వేసింది. 1970లో వచ్చిన భోలా తుఫాన్ సాయుధ సమరంవైపు నడిపించింది. ఆ తుఫాన్లో దాదాపు ఐదు లక్షల మంది బంగాలీలు మరణించినా పాకిస్థాన్ పాలకుల గుండెలు కరగలేదు. కంటితుడుపు సహాయచర్యలు మాత్రమే చేపట్టారు. నిధులను, వనరులను దోచుకోవటానికే తప్ప తమ ప్రాంతం బాగోగులను పట్టించుకోని కేంద్ర పాలకుల వివక్ష మీద ఆగ్రహం మొదలైంది. దీంతో స్వీయ పాలనలోనే తమకు న్యాయం జరుగుతుందని బంగాలీలు భావించారు. బంగ్లా విముక్తి పోరాటం పాకిస్థాన్ కర్కశ సైనిక దాడులకు వెరవకుండా ముందుకు సాగింది. పాకిస్థాన్ సైనికుల ఊచకోతలో దాదాపు 30 లక్షల మంది మరణించినట్టు అంచనా. పైగా బంగ్లాదేశ్ ఉద్యమ నాయకుడైన ముజిబుర్ రహ్మాన్ను బంగ్లాదేశ్లో కాకుండా పాకిస్థాన్కు తరలించి బంధించడం పుండు మీద కారం చల్లినట్టయింది.
బంగ్లా పోరాటానికి భారత్ సైనిక మద్దతు ఇవ్వడం ఆనాడు అంతర్జాతీయ రంగంలో ఉద్విగ్న ఘట్టం. పాకిస్థాన్కు మద్దతుగా అమెరికా తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాతంలోకి తరలించింది. కానీ రష్యా హెచ్చరిక, మరోవైపు తమ సైనికులు తొంభై వేల మంది భారత సైన్యం ముందు లొంగిపోవడంతో పాకిస్థాన్ దిగిరాక తప్పలేదు. లౌకిక రాజ్యంగా అవతరించిన బంగ్లాదేశ్ కొన్ని దశాబ్దాల పాటు నిరంకుశ పాలన, మతోన్మాద విధానాలతో సంక్షుభితం కావడం విషాదం. జాతిపితగా గౌరవం పొందిన ముజిబుర్ రహ్మాన్పై సైనిక తిరుగుబాటు జరిగి ఆయన హతుడయ్యాడు. ప్రచ్ఛన్నయుద్ధ రాజకీయాలు ఉపఖండంలో చిచ్చు రేపాయి. ఇప్పుడు ముజిబ్ కుమార్తె షేక్ హసీనా నాయకత్వంలో లౌకిక ప్రభుత్వం ఏర్పడటమే కాకుండా భారత్తో స్నేహ సంబంధాలు నెలకొనడం హర్షణీయం. భారత్తో స్నేహం కొనసాగిస్తూ బంగ్లాదేశ్ ప్రగతి పథంలో సాగుతుందని ఆశిద్దాం.