కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణ క్రమంగా గందరగోళంలో పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా తనకే అప్పగించాలని కేంద్రం పట్టుదలగా ఉన్నది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ తనవైన కారణాలతో పూర్తి అంగీకారం తెలిపింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఊగిసలాట ధోరణిలో పోతున్నది. కేంద్రం ఒత్తిడిని కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుంచీ తీవ్రంగా ప్రతిఘటించడం తెలిసిందే.
ఈనెల 17న కేంద్ర జల్ శక్తి శాఖ ఇరురాష్ర్టాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన మొత్తం 15 ఔట్లెట్లు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించాలని ఆదేశించింది. ముందుగా యావత్తు నిర్వహణను బోర్డుకు అప్పగించాలని, ఏవైనా అభ్యంతరాలుంటే తర్వాత పరిష్కరిస్తామని చెప్పింది. అందుకు ఏపీ సర్కారుతో పాటుగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకొన్నట్టు మినిట్స్ను జల్ శక్తి శాఖ విడుదల చేసింది.
కేంద్రం తాఖీదుకు రాష్ట్రప్రభుత్వం తలవంచిందనే వార్తలపై రాష్ట్రంలో సహజంగానే ఆందోళన వ్యక్తమైంది. తెలంగాణవాదులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. అయితే కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా ఉండటం తెలిసిందే. తాజాగా ప్రాజెక్టుల అప్పగింతపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ధోరణి అదేతీరుగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది.
మినిట్స్లో సమాచారం సరిగ్గా ఇవ్వలేదని అంటున్నది. ఈ అంశంపై తీసుకోవాల్సిన నిర్ణయంపై తర్జనభర్జనలు చేస్తున్నదని, త్వరలో లేఖ రాయనున్నదని తెలియవస్తున్నది. అయితే వీటన్నిటితో ప్రమేయం లేకుండా ప్రాజెక్టుల స్వాధీనానికి కేఆర్ఎంబీ సమాయత్తమవుతున్నట్టు వార్తలు వెలువడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ప్రక్రియ పూర్తయితే రాష్ట్రం ఆగమైపోతుంది. సాగునీరు, తాగునీరు అవసరాలకు కేఆర్ఎంబీ నిర్ణయాలపైనా, కేంద్రం దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది.
విద్యుత్తు ఉత్పత్తిపై అజమాయిషీ కూడా మన చేజారిపోతుంది. ట్రిబ్యునల్ అవార్డును పట్టించుకోకుండా ఏడేండ్ల వినియోగాన్ని బట్టి రూపొందించిన రూల్ కర్వ్ ఇప్పుడు కేంద్రం పెత్తనం కింద అమలులోకి వస్తే రాష్ట్ర నీటిహక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడుతుంది. పైగా ఏపీ అక్రమ నీటి తరలింపును అడ్డుకునే మార్గం మనచేతుల్లో ఉండదు. గత నవంబర్లో రాష్ట్రంలో ఎన్నికల సందడి నడుమ సడేమియా అన్నట్టుగా సాగర్ ప్రాజెక్టు ఆక్రమణకు ఏపీ తెగించిన సంగతి గుర్తుంచుకోవాలి.
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం అంటే మన హక్కులను చేజేతులా కోల్పోవడమేననేది కేసీఆర్ ప్రభుత్వ వాదనగా ఉండింది. ఆ దృష్టితోనే ప్రాజెక్టుల నిర్వహణకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించిన రూల్ కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్పై రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకించింది. కృష్ణాజలాల్లో మన వాటాకు, కొత్త ప్రాజెక్టులకు సమస్యలు ఎదురవుతాయనేది బీఆర్ఎస్ వాదన. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే అవగాహన లేకుండా, ఓ వ్యూహాన్ని రూపొందించుకోకుండా ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లేలా వ్యవహరించడం రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమని చెప్పకతప్పదు. ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాలను తగినవిధంగా సమీక్షించుకుని, సవరించుకొని అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.