రిజర్వేషన్లను నిర్వీర్యం చేసే కేంద్ర సర్కారు మరో పోరాటం తప్పదు
టీఆర్ఎస్లో ఈటల ఒక్కడికే న్యాయం జరిగింది
పదవులన్నీ అనుభవించి.. 4వేల కోట్లు సంపాదించుకున్నడు
అణగారిన వర్గాలకు అన్యాయం చేసే పార్టీలో ఎలా చేరిండో చెప్పాలి
ఈటల ఓటమే లక్ష్యంగా పనిచేద్దాం.. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ధ్వజం
జమ్మికుంటలో పీఎస్ జేసీఏ, టీఏవైఎస్ ఆధ్వర్యంలో సదస్సు
జమ్మికుంట, జూలై 5: అణగారిన వర్గాల రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్న బీజేపీపై మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పిలుపునిచ్చారు. సోమవారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రక్షణలో భాగంగా నిర్వహించిన హుజూరాబాద్ నియోజకవర్గ ‘రాజ్యాంగ రక్షణ సదస్సు’కు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. హక్కులను, రిజర్వేషన్లు కాలరాసే బీజేపీని తరిమికొట్టాలని, తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ, అమిత్షా, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలను ఛేదించాలని విజ్ఞప్తి చేశారు. ఏడాదికి రెండు కోట్ల కొలువులిస్తామని నమ్మబలికిన బీజేపీ ఇప్పటి వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. పైగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నదని, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని, రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఇష్టపడడం లేదని మండిపడ్డారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీపై దాడులు, మానభంగాలు, కేసులు, హత్యలు పెరుగుతున్నాయని, బీజేపీకి ఇక్కడ చోటిస్తే తెలంగాణలో కూడా అదే పరిస్థితులు వస్తాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగం రక్షణ కోసం ఉద్యమించాలని కోరారు.
ఆత్మగౌరవమంటే ఏంటో ఈటల చెప్పాలి..?
వామపక్ష భావాలున్న ఈటల ఉన్నత వర్గాల్లో కలిసిపోయాడని, బీజేపీలో ఎట్లా చేరావని ప్రశ్నించారు. మూడు, నాలుగు వేల కోట్లు సంపాదించుకున్నడని ఆరోపించారు. “రెడ్డి అల్లుడిని, కోడలును తెచ్చుకున్నవ్.. భార్య రెడ్డి, నీవు సగం రెడ్డివి. ఉన్నత కుటుంబాల్లో చేరినవా..? లేదా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవం అంటే ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ‘అణగారిన వర్గాల రిజర్వేషన్లు తొలగించే పార్టీలో చేరడం ఆత్మ గౌరవమా..? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు చేసే పార్టీలో చేరడం ఆత్మ గౌరవమా..? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే కుట్రలు పన్నుతున్న మోదీ, అమిత్షా, ఆర్ఎస్ఎస్ నాయకుల వద్ద మోకరిల్లడం ఆత్మ గౌరవమా..? ఈటల చెప్పాలంటూ’ ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజల బాగోగుల కోసం పనిచేయలేదు.. కానీ, సొంత ప్రయోజనాల కోసం ఎట్లా బీజేపీలో చేరావని మండిపడ్డారు. 18ఏళ్ల నీ రాజకీయ జీవితంలో అణగారిన వర్గాలను విభజించి పాలించావని దుయ్యబట్టారు. సంఘాలు లేకుండా చేశాడని ఆరోపించారు. టీఆర్ఎస్లో ఈటల రాజేందర్ ఒక్కడికే న్యాయం జరిగిందని, పార్టీలో చేరిన నాలుగు నెలలకే ఎమ్మెల్యే అయ్యాడని చెప్పారు.
తర్వాత శాసనసభ పక్ష నేతగా, మంత్రిగా పదవులన్నీ అనుభవించిన విషయాలను వివరించారు. సీఎం కేసీఆర్ ఆయనకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ‘మా కోసం పనిజేసేటోనివైతే.. మమ్మల్ని అణగదొక్కే బీజేపీలో ఎలా చేరావని’ ప్రశ్నించారు. ఇండిపెండెంట్గా ఉండాలని, బీజేపీ నుంచి వస్తే గెలువకుండా చేస్తమని హెచ్చరించారు. అన్ని నియోజకవర్గాల్లో సదస్సులు నిర్వహిస్తామని, అణగారిన వర్గాలను కాపాడుకుంటామని పేర్కొన్నారు. బీజేపీని తెలంగాణలో గెలవకుండా చేయాలని, ఆ పార్టీని నాశనం చేసేదాకా నిద్రపోనని ప్రతినబూనారు. స్వాతంత్య్రం నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దాకా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని, పాదయాత్ర చేసే బండి సంజయ్కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పేర్కొన్నారు. ఇక్కడ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ సన్ని, టీఏవైఎస్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల పాండు, నాయకులు గంగారాం, తిరుపతి, సాంబయ్య, అజయ్, కుమారస్వామి, కైరొద్దీన్ సాహెబ్, ప్రభాకర్, వంశీ, వేణు, నరేశ్, సమ్మయ్య, శ్రీనివాస్, సాగర్, చక్రపాణి, దేవయ్య, రాజేందర్, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొనగా, కళాకారులు తమ ఆట, పాటలతో అలరించారు.