అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలపై సోదరి కడప ఎంపీ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కన్నీటిపర్యంతం అయ్యారు. జగనన్న (YS Jagan) కోసం అనేక త్యాగాలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కడప కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తనను నెపొటిజం (Nepotism) తో పోల్చడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయంలో బంధువులుండరాదని జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. జగన్ బంధువులు రవీందర్నాథ్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్రెడ్డి, తల్లి విజయమ్మ తదితరులు రాజకీయంలో ఉంటే నెపొటిజం కాదు. చెల్లెలు షర్మిల ఒక్కతే రాజకీయంలో ఉంటే నెపొటిజం కిందకు వస్తుందా అంటూ ప్రశ్నించారు. జగన్ను అరెస్టు చేసినపుడు వేలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేశానని , తండ్రి వైఎస్సార్ చనిపోయినపుడు ఓదార్పు యాత్ర చేశానని వెల్లడించారు. ఇదంతా ఎలాంటి స్వార్థం లేకుండా జగన్ కోసమే చేశానని స్పష్టం చేశారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాలో రాజకీయం, డబ్బు కాంక్ష లేదని, ఏది చేసినా జగన్ భవిష్యత్, జగన్కు ముఖ్యమంత్రి పదవి కోసం తాను త్యాగం చేశానని వెల్లడించారు. ఈ విషయంలో తాను బైబిల్పై ప్రమాణం చేస్తానని, నువ్వు చేస్తావా అంటూ జగన్ను ప్రశ్నించారు. చెల్లెలు ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడిన జగన్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని ఆరోపణలను ఖండించారు. వైఎస్సార్ ఆశయాల కోసం ఆయన కూతురుగా కడపలో పోటీ చేస్తున్నానని తెలిపారు.