హుస్నాబాద్, మే 8 : మా అమ్మ సుగుణ ప్రోత్సాహంతోనే డిగ్రీ పూర్తి చేశాను. కరీంనగర్లో పుట్టి పెరిగాను కాబట్టి నాకు కొంత సామాజిక అంశాలు అలవడ్డాయని చెప్పొచ్చు. మా అమ్మ నిత్యం అమ్మాయిలు ఎలా ఉండాలి… ఎలా ఇతరులతో మెలగాలి…పది మందిలోనూ ధైర్యంగా ఎలా మాట్లాడాలనే విషయాలను చెబుతుండేది… ఆమె చెప్పిన మాటలే ఇప్పుడు నన్ను మున్సిపల్ చైర్పర్సన్గా రాణింపజేస్తున్నాయి. నా భర్త వెంకట్ ప్రోత్సాహంతో మున్సిపల్ చైర్పర్సన్గా పదవి చేపట్టినప్పటి నుంచి ఆయనతో పాటు మా అమ్మ చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిస్తున్నాయి. సభలు, సమావేశాలు, పది మందిలో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా… నాకు ఇద్దరు కూతుళ్లు. మా అమ్మ ఇచ్చిన స్ఫూర్తితోనే నా పిల్లలను పెంచుతున్నా… వారిని అన్ని విషయాల్లో ప్రోత్సహించి ఉన్నత స్థానాల్లో స్థిరపడేలా చూస్తున్నా. పెద్ద కూతురు హరిప్రియ బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఏడీపీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నది. చిన్న కూతురు లక్ష్మీప్రియ బీటెక్ ఫైనలియర్ చదువుతున్నది. అమ్మతనం అనేది గొప్ప బాధ్యత. దానిని నెరవేర్చుకుంటూ…పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటూ… భర్త సహకారంతో ఇటు రాజకీయాల్లోనూ రాణించడం ఆనందంగా ఉంది.