కాచిగూడ : తల్లిదండ్రులు తన స్నేహితులను మందలించారని మనస్థాపంతో గుంటూరు రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
రాజేంద్రనగర్, కాటేదాన్లోని శ్రీరామ్నగర్ ప్రాంతానికి చెందిన అన్వేశ్ కుమార్రెడ్డి (20) ఇంటర్ పూర్తి చేశాడు. ఇటీవలనే అర్మీకి సెలెక్ట్ అయ్యాడు.రిటన్ టెస్ట్ ఉండడడంతో తల్లిదండ్రులు చదువుకోవాలని కొడుకును, ఆతని స్నేహితులను మందలించారు.
దీంతో తన స్నేహితులను మందలించారని మనస్థాపంతో సోమవారం బుద్వేల్ రైల్వేస్టేషన్ యార్డ్ సమీపంలో గుంటూరు రైలు కిందపడి అన్వేశ్ కుమార్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆతని శరీర భాగాలు చెల్లచెదురైనాయి.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.