మియాపూర్ : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని సమున్నత అభివృద్దిలో అగ్రభాగంలో నిలపటమే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు, పెరుగుతున్న జనాభా కాలనీల నేపథ్యంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా అదనం గా చేపట్టాల్సిన పనులకు తగు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంత్రి కేటీఆర్ను కోరారు.
ఈ మేరకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు, మాధవరం రోజాదేవిలతో కలిసి విప్ గాంధీ మంగళ వారం కేటీఆర్ను ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా నియోజవకర్గంలో సీవరేజీ, రోడ్లు, లింక్ రోడ్లు, చెరువుల సుందరీకరణ, స్మశానవాటికల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, నల్లగండ్ల ఎస్టీపీ నిర్మాణం, తాగునీటి నెట్వర్క్ విస్తరణకు సంబంధించిన అంశాలపై అదనపు నిధుల మంజూరుకు వినతిపత్రం అందించారు.
అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గమైన శేరిలింగంపల్లి అంతే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలతో మౌలిక వసతులను కల్పించినట్లు, వాటిని మరింతగా విస్తరించేందుకు తమ తోడ్పాటును అందించాలని విప్ గాంధీ కేటీఆర్ను కోరారు.
దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు వేదికగా ఉన్న నియోజవర్గ సమున్నత అభివృద్ధే ధ్యేయంగా తాను అహర్నిషలు కృషి చేస్తున్నట్లు, రాబోయే రోజులలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో మరింతగా పురోగతి సాధించాలనే తపనతో ఉన్నట్లు పేర్కొన్నారు.
కాగా విప్ గాంధీ వినతి పట్ల కేటీఆర్ స్పందించి ఒకటి రెండు రోజులలోనూ నియోజవకర్గ అభివృద్ఢిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పాల్గొన్నారు.