Marijuana
మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నింధితుల వద్ద నుంచి 24 లక్షల విలువ చేసే 120 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సికింద్రాబాద్ రైల్వే రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను లు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అంభికా నహక్ (36) , మాలతి సా (52) కూలీలు. వీరిద్దరు ఒరిస్సా రాష్ట్రంలోని భువన్వేర్ బెహనర్పూర్ ప్రాంతంనుంచి ముంబాయికి కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో ఎ-2, ఎస్-8 కోచ్లలో నాలుగు బ్యాగ్ల్లో 120 కిలోల గంజాయిని సరఫరా చేస్తున్నారు.
ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు మంగళవారం ఉదయం రైలు చేరుకోవడంతో…రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వీరిద్దరు అనుమానస్పదంగా కనిపించడంతో రైల్వే పోలీసులు వారి వద్ద ఉన్న బ్యాగ్లను తనిఖీ చేయగా గంజాయి అని తెలింది.
దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. ఒరిస్సాలో కిలో గంజాయి 2 నుంచి 3 వేలకు కొనుగో లు చేసి ముంబాయిలో 10 నుంచి 15 వేలకు కిలో చోప్పున అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిపారు.
రైళ్లలో జరగుతున్న గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు రైల్వే జీఆర్పి, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారని…గత రెండు నెలల వ్యవధిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు 7 కేసులలో 11 మంది నింధితులను అరెస్టు చేసి 296 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పెర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ నరసింహ, ఎస్ఐలు రమేష్, సిబ్బంది మునేశ్వర్, హరిలాల్ తదితరులు పాల్గొన్నారు.