రవీంద్రభారతి : నేటి బాలలే రేపటి పౌరులని వారి హక్కులను పరిరక్షించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అనాధ పిల్లల సంరక్షణ, భద్రత, ఫోషణ వారి హక్కులను కాపాడడం వంటి అంశాలలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దృఢ సంకల్పమని అన్నారు.
ఆదివారం రవీంద్రభారతిలో రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవానికి ముఖ్య అతిధులుగా మంత్రులు సత్యవతిరాథోడ్, శ్రీనివాసయాదవ్లు విచ్చేశారు. అనంతరం మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ కరోనా సమయంలో తల్లిదండ్రులను కొల్పొయిన అనాధలు సుమారు 16వేల మంది వరకు ఉన్నారని వివరించారు.
వారందరినీ తమ శాఖ అధికారులు అన్ని విధాలుగా ఆదుకుంటూ తల్లిదండ్రులు లేని లోటును తీరుస్తూ చదువులో పోత్సహిస్తున్నారని వివరించారు. అనాధ పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు విద్యతోపాటు అన్ని రంగాలలో వారి ఎదుగుదలకు ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తాము అనాధలమనే భావన రాకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. సీఎం ఆదేశాల మేరకు త్వరలో బాలల ఎదుగుదల ఇతర అంశాలలో పురోగతికి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సమాజంలో వారికి అన్ని హక్కులు అవకాశాలు ఉన్నాయన్న నమ్మకం వారిలో కల్పిస్తామన్నారు.
బాలలపై హేయమైన ఘటనలు జరగడం అత్యంత బాధకరమని, ఈ మేరకు సమాజంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనాధల సంక్షేమం, వారి ఉన్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకోవాలని మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు.
అనంతరం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి టి .శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో బాలల చట్టాలు పటిష్టంగా అమలు కాలేదని, తెలంగాణ సిద్ధించిన 2014 తర్వాత కేసీఆర్ ఆదేశాల మేరకు వారి సంక్షేమానికి పటిష్టమైన చర్యలు అమలౌవుతున్నాయన్నారు.
అనాధలు విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కళల అంశాల్లో రాణిస్తున్నారని, వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రోత్సాహిస్తున్నామని వివరించారు. అనాధలకు సన్నబియ్యంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో శిశుసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దివ్య, అధికారులు శ్రీనివాసరావు, అపర్ణ, నాగజ్యోతి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన విభిన్న రకాల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.