కవాడిగూడ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
శుక్రవారం భోలక్పూర్ యూపీహెచ్సీని ఆయన సందర్శించారు. దవాఖానలో రోగుల పరిస్థితిని డాక్టర్ కృష్ణమోహన్ రావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దవాఖాన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు.
దవాఖాన ప్రాంగణంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను జీహెచ్ఎంసీ సిబ్బందితో తొలగింపజేశారు. ముషీరాబాద్, భోలక్పూర్ యూపీహెచ్సీలు రెండు ఒకేచోట ఉండడంతో రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా షెడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, నాయకులు శ్రీనివాస్, శ్రావణ్కుమార్, ఏ.శంకర్ గౌడ్, రహీం, మోజెస్, మున్వర్ చాంద్, ప్రవీణ్, ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.